హైదరాబాద్: కటక్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ వన్డేలో టీమిండియా ఆటగాళ్లు యువరాజ్ సింగ్-ధోనీల జోడి సరికొత్త రికార్డుని నమోదు చేసింది. నాలుగో వికెట్కు వీరిద్దరూ 176 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో ఇంగ్లాండ్పై నాలుగో వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఘనతను ఈ జోడీ సొంతం చేసుకుంది. అంతకుముందు 2012లో దక్షిణాఫ్రికా జోడి హషీమ్ ఆమ్లా-ఏబీ డివిలియర్స్లు ఇంగ్లాండ్పై నమోదు చేసిన 172 పరుగుల భాగస్వామ్యాన్ని కటక్ వన్డేలో యువీ-ధోనిలు అధిగమించారు.
రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ధోని సేనను బ్యాటింగ్కు ఆహ్వానించింది. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను యువీ-ధోనిల జోడీ నిలకడగా ఆడి సెంచరీలతో చెలరేగారు. దీంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. లోకేష్ రాహుల్(5), ధావన్(11), కోహ్లీ(8) తొందరగానే ఔటైనప్పటికీ యువీ, ధోనీలు నిలకడగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్కు 382 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ వోక్స్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అంతక ముందు 126 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రెండో వన్డేలో యువీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.
సెంచరీ అనంతరం దూకుడుగా ఆడిన యువీ అంతే వేగంగా 150 పరుగుల మార్క్ను అందుకున్నాడు. ధోని సెంచరీ సాధించాడు. 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ చేసిన తొలి సెంచరీ ఇదే. తన వన్డే కెరీర్లో 10వ సెంచరీ నమోదు చేశాడు.