న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిదేళ్ల క్రితం తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్లో స్టువార్ట్ బ్రాడ్ ఓవర్లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. ఇది అందరి మనసుల్లో ఇప్పటికీ నిలిచి ఉంది. దానికి ముందు మరో ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్తో గొడవ జరిగిన తర్వాతే తనలో ఆవేశం పెరిగిందని యువీ పలుమార్లు చెప్పాడు.
అయితే, వారిద్దరి మధ్య సరిగ్గా ఏం సంభాషణ జరిగిందనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా, యువరాజ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించాడు. తొలి ట్వంటీ 20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్పై యువీ సృష్టించిన విధ్వంసాన్ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.
స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్లో వరుసగా ఆరు బంతుల్ని సిక్సులుగా మలిచి పొట్టి క్రికెట్లో కొత్త రికార్డు నెలకొల్పాడు. దీనిపై యువీ మాట్లాడుతూ... మ్యాచ్లో అంతకుముందు ఫ్లింటాఫ్తో జరిగిన వాగ్వాదమే తనను అంతలా రెచ్చిపోయేలా చేసిందని చెప్పాడు.
ఫ్లింటాఫ్ బౌలింగ్లో రెండు ఫోర్లు కొట్టానని, అవి చెత్త షాట్లంటూ ఓ బూతు పదం అతను వాడాడని, నేనూ ఓ బూతు తిట్టానని యువీ చెప్పాడు. ఏం మాట్లాడావని అతను తనని అడిగాడని, దానికి తాను ఘాటుగానే.. నువ్వు సరిగ్గానే విన్నావని చెప్పానని తెలిపాడు.
దానికి అతను 'నీ గొంతు కోస్తానని' తనను అన్నాడని యువీ చెప్పాడు. ఈ బ్యాట్ పుచ్చుకుని నిన్ను ఎక్కడ బాదుతానో తెలుసుగా అని నేను సమాధానం చెప్పానని, ఆ గొడవ వల్ల తన కోపం కట్టలు తెంచుకుందని, ప్రతి బంతిని బౌండరీ దాటించాలనుకున్నానని చెప్పాడు. స్లెడ్జింగ్ కొన్ని సార్లు సాయపడుతుందని, కొన్ని కొన్నిసార్లు తిప్పికొడుతుందని, ఆ రోజు ఇంగ్లాండ్ వాళ్లకు రెండోదే జరిగిందని చెప్పాడు.