న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో తిరిగి చోటు సంపాదించుకునేందుకు వెటరన్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడనే విషయం తాజాగా ద టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడైంది.
ఇప్పటికీ తాను తయారుగానే ఉన్నానని, కొన్ని వారాల క్రితం జరిగిన మ్యాచ్లో కెరీర్లోనే ది బెస్ట్ 260 పరుగులు సాధించానని టెలిగ్రాఫ్కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. యువీ చివరిసారిగా 2016లో జరిగిన వరల్డ్ టీ20లో భారత జట్టు తరుపున బరిలోకి దిగాడు.
భారత్ Vs ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ ఫోటోలు
మొహాలిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆడాడు. ఇటీవల కాలంలో రంజీ ట్రోఫీలోగా భాగంగా పంజాబ్ జట్టు తరుపున ఆడుతున్న యువరాజ్ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇటీవలే బరోడాతో జరిగిన రంజీ మ్యాచ్లో కెరీర్లోనే అత్యధిక స్కోరు 260 పరుగులు నమోదు చేశాడు.
న్యూజిలాండ్ సిరిస్లో యువీని సెలక్టర్లు ఎంపిక చేయకపోవడంపై నిరాశ చెందిన యువరాజ్ ఆ తర్వాత రంజీ మ్యాచ్లో భాగంగా అక్టోబర్ 14న లాహ్లిలో 177 పరుగులతో సెంచరీ సాధించాడు. మధ్యప్రదేశ్పై జరిగిన మ్యాచ్లో 295 బంతులను ఎదుర్కొన్న యువరాజ్ 24 ఫోర్లతో 177 పరుగులు సాధించాడు.
అయినప్పటికీ ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో యువరాజ్ను ఎంపిక చేయలేదు. యువరాజ్ మాత్రం భారత జట్టులో చోటు కోసం తన ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లాండ్తో భారత్ వన్డే, టీ20 సిరిస్లను ఆడనుంది.
కనీసం వాటిల్లోనైనా చోటు దక్కించుకోవాలనే ఆశతోనే రంజీల్లో యువరాజ్ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. ఇదే ప్రదర్శనను గనుక యువీ కొనసాగిస్తే, ఇంగ్లాండ్తో రాబోయే రోజుల్లో జరగనున్న వన్డే, టీ20 సిరిస్ల్లో యువీకి చోటు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది.