న్యూఢిల్లీ: కటక్ స్టేడియంలో ప్రేక్షకులు బాటిళ్లు విసిరిన ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. కటక్ బారాబతి స్టేడియంలో రెండు సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించకుండా నిషేధం విధించాలని సూచించాడు.
ఈ ఘటనకు పోలీసులదే బాధ్యతని మండిపడ్డాడు. కటక్కు రెండేళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచులు కేటాయించకూడదని, అలాగే ఒడిశా క్రికెట్ సంఘానికి సబ్సిడీలు కూడా నిలిపివేయాలని గవాస్కర్ సూచించాడు.
టీమిండియా బాగా ఆడినప్పుడు విలువైనవి ఏమైనా స్టేడియంలో వేశారా? అని సన్నీ ప్రశ్నించాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య కటక్లో సోమవారం జరిగిన ట్వంటీ20 మ్యాచ్లో భారత్ 92 పరుగులకు ఆలౌట్ అయింది.
దీంతో ఆగ్రహానికి గురైన స్టేడియంలోని ప్రేక్షకులు అనూహ్యంగా వాటర్ బాటిళ్లు విసరడంతో ఆటకు అంతరాయం కలిగింది. సోమవారం కటక్లో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.