ఇంగ్లాండ్: లండన్లో జరుగుతున్న ద వేల్స్ ఇంటర్నేషనల్ రగ్బీ లీగ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. లీగ్లో నార్తెన్ ఇంగ్లిష్ క్లబ్ కైగ్లీ కోగార్స్ తరఫున ఆడుతున్న డేనీ జోన్స్ అనే క్రీడాకారుడు రగ్బీ ఆడుతూ మైదానంలోనే గుండె పోటుతో కుప్పకూలాడు.
వైద్యులు హుటాహుటిన మైదానంలోనే ప్రాథమిక చికిత్స అందించి రాయల్ ఫ్రీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డేనీ మృతిచెందాడు. అతడికి 5 నెలల కవల పిల్లలు ఉన్నారు.
డేనీ సహజ నాయకుడని, డ్రెస్సింగ్ రూంలో అతడి స్థానం భర్తీ కాదని, ఆయన మృతితో తాము విషాదంలో మునిగిపోయినట్లు కైగ్లీ కోగార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
డేనీ మరణం తమను ఎంతో బాధించిందని జట్టు సభ్యులు పేర్కొన్నారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంచి ప్రతిభగల ఆటగాడ్ని కోల్పోయామని చెప్పారు.
ఇటీవల క్రికెట్, ఫుట్బాల్ లాంటి క్రీడల్లో క్రీడాకారులు మైదానంలో గాయపడి మృత్యువాత పడగా, ఇప్పుడు రగ్బీ ఆటగాడు మరణించడం ఆందోళన కలిగించే విషయం.