న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని కూతురు జీవా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియాకు మద్దతు పలుకుతున్నారు. ధోనీ ఫేస్బుక్ పేజీలో తన ప్రొఫైల్ పిక్చర్ మార్చాడు.
సెప్టెంబర్ 27వ తేదీన రాత్రి ధోనీ తన ఫేస్బుక్ పిక్చర్ మార్చాడు. డిజిటల్ ఇండియాకు మద్దతుగా ప్రొఫైల్ పిక్చర్ ఉంచాడు. అందులో ధోనీ, తన కూతురు జీవాతో కలిసి ఉన్నాడు. ఏడు నెలల తన చిన్నారిని చేతులతో ఎత్తుకొని కనిపించాడు.
ఆ ఫోటో కింద... 'సపోర్ట్ డిజిటల్ ఇండియా ఎట్ ఎఫ్బీ.కామ్/సపోర్ట్ డిజిటల్ ఇండియా' అని సందేశం ఉంది. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ... త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు.
ఇప్పటికే...
ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకెర్బర్గ్ డిజిటల్ ఇండియాకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ వాల్లో ఒక పోస్ట్ ప్రచురించారు. డిజిటల్ ఇండియాకు మద్దతుగా తన ప్రొఫైల్ చిత్రాన్ని మూడు రంగుల భారత పతాకం రంగులతో రంగరించారు.
గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే క్రమంలో భారత్ చేస్తున్న కృషికి మద్దతిస్తున్నానని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాకు మద్దతు ఇవ్వాలని తన అభిమానులను కోరారు. భారత ప్రధాని మోడీ కూడా జూకెర్బర్గ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు.
జూకెర్ బర్గ్ తరహాలోనే మూడు రంగుల భారత పతాకాన్ని చేర్చారు. కాగా,క భారత్లో పర్యటించాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. భారతదేశ సౌందర్యాన్ని, భిన్నత్వాన్ని, భారతీయుల ఆత్మీయతను ఆస్వాదించాలంటూ పర్యాటకులకు పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యాటకదినం సందర్భంగా ఆదివారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతకుముందు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రపంచ పర్యాటకంలో ప్రస్తుతం 0.68గా ఉన్న భారత వాటాను 2020 కల్లా ఒక శాతానికి పెంచాల్సి ఉందన్నారు.