మెల్బోర్న్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు సుధీర్ కుమార్ గౌతమ్ అనే వీరాభిమాని ఉన్న విషయం యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలిసిందే. అయితే ఇప్పుడు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఓ వీరాభిమాని ఉన్నాడు. ఇతను పాకిస్ధాన్కు చెందిన వ్యక్తి కావడం విశేషం.
అమెరికాలోని చికాగోలో హోటల్ నడుపుకునే పాకిస్ధాన్కు చెందిన బషీర్, పాకిస్ధాన్ క్రికెట్ జట్టు ప్రపంచంలో ఎక్కడైనా ఆడుతుంటే ఆ మ్యాచ్కి హాజరవుతుంటాడు. అయితే ఇతను కేవలం పాకిస్ధాన్కు మాత్రమే కాదు, టీమిండియాకు కూడా అభిమానే.
రెండు దేశాల మధ్య ఎక్కడ మ్యాచ్ జరిగినా రెండు జాతీయ జెండాలతో పోలీస్ డ్రెస్ ధరించి రెండు జాతీయ జెండాలు పట్టుకుని హాజరవుతాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్లో ఇటీవలే అడిలైడ్ లో జరిగిన భారత్-పాకిస్ధాన్ మ్యాచ్కి హాజరయ్యాడు.
పాకిస్ధాన్ జట్టు ఆట చూసిన బషీర్కు వారి ఆట నచ్చక పోడవం వల్లే ఏమోగానీ, ఇప్పుడు టీమిండియా జట్టు వెంట తిరిగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ ధోనీకి బషీర్ వీరాభిమాని. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు ధోనియే బషీర్కు టికెట్ ఇచ్చాడు. మెల్ బోర్న్లో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ వద్దకు వచ్చాడు.
బషీర్ ధరించిన టీ షర్ట్పై 'ధోని ఐ లవ్ యూ' అని రాసి ఉండటంతో చూసిన ధోని నవ్వుకున్నాడు. అంతలోనే బషీర్ను గుర్తు పట్టి చిరునవ్వుతో పలకరించాడు. తర్వాత బషీర్ టీ షర్ట్పై ధోని సంతకం చేశాడు. అప్పుడు బషీర్ మాట్లాడుతూ "నీ కూతురు అదృష్టాన్ని తెస్తుంది. వరల్డ్ కప్ తోనే వెళ్తావు" అని అన్నాడు.
దీంతో కెప్టెన్ ధోని ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇక బషీర్కు రోహిత్ శర్మ తన కళ్లద్దాలను బహుమతిగా ఇచ్చాడు. ఇక బషీర్ భార్య హైదరాబాద్కు చెందిన ఆమె కావడం మరో విశేషం.