సిడ్నీ: ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్(25) మృతి చెందిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం తలకు క్రికెట్ బంతి తగిలి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన హ్యూస్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. క్రికెట్ బంతి తగలడంతో హ్యూస్ ఎలా మృతి చెందాడనే విషయమై ఆస్ట్రేలియా వైద్యులు తెలిపారు. హ్యూస్ సెయింట్ విన్సెంట్ ఆసుపత్రిలో కన్నుమూశాడు.
ఆస్ట్రేలియన్ టీమ్ డాక్టర్ పీటర్ బ్రంకర్, ఇతర వైద్యులు విలేకరులతో మాట్లాడారు. వారు ఉద్వేగంతో ప్రెస్ కాన్ఫరెన్స్లో హ్యూస్ మృతి పైన మాట్లాడారు. మెడకు ఓ పక్క ఉండే వెర్టెబ్రల్ అర్టెరికి బంతి వచ్చి బలంగా తగిలిందని, దీంతో అతని వెన్నుపూస దెబ్బతిన్నదని చెప్పారు.
మెదడుకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఇది చాలా కీలకమని తెలిపారు. అది నలిగిపహోవడం వల్ల మెదడులోకి రక్తం సరఫరా సరిగా జరగలేదని చెప్పారు. దీనిని వైద్య పరిభాషలో వెర్టెబ్రల్ ఆర్టెరీ డిఫెక్షన్ అంటారని చెప్పారు. ఇది అతని ప్రాణాలమీదకు తెచ్చిందని తెలిపారు. ఈ తరహా ప్రమాదం అత్యంత అరుదైనదని, ఎప్పుడో గానీ జరగదని పీటర్ బ్రంకర్ చెప్పారు.
ఇలాంటి ప్రమాదాన్ని తాము ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదని చెప్పారు. అయితే, డాక్టర్ల బృందం అతనిని కాపాడేందుకు ప్రయత్నించిందని, అందుకోసం మెదడు చుట్టూ ఉండే పుర్రెలో కొంత భాగాన్ని తొలగించి మెదడుకు రక్త సరఫరా పెంచేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం గంటా ఇరవై నిమిషాలకు పైగా పట్టిందన్నారు.
అనంతరం అతనిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించామన్నారు. ఆ తర్వాత చికిత్సలో భాగంగా అతనిని కోమాలోకి పంపించినట్లు చెప్పారు. అతనికి, అతని మెదడుకు విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో కోమాలోకి పంపించినట్లు చెప్పారు. ఆ తర్వాత తొలి 24 గంటల నుండి 48 గంటల వరకు ఎంత వరకు రికవరీ కావాలో అంత కాలేదని, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ ప్రాణాలు వదిలాడని చెప్పారు.