మెల్బోర్న్: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల భారీ స్కోరు చేయలేకపోతున్నా.. రోహిత్ శర్మపై తన నమ్మకాన్ని వెలిబుచ్చాడు. పరుగులను చూసి రోహిత్ శర్మను తక్కువగా అంచనా వేయొద్దని కెప్టెన్ ధోని పేర్కొన్నాడు. టోర్నీలో ఇప్పటివరకు అతడు చేసిన పరుగులు తక్కువే అయినా.. కుదురుగా బ్యాటింగ్ చేస్తున్నాడని అభిప్రాయపడ్డాడు.
'కేవలం పరుగులకే ప్రాధాన్యమివ్వకూడదు. బాగా ఆడుతున్న బ్యాట్స్మెన్ కూడా అప్పుడప్పుడు పరుగులు చేయలేకపోతారు. ఏదో ఒక మ్యాచ్లో వీరవిహారంతో మళ్లీ ఊపులోకి వస్తుంటాడు. అది ఫామ్లో లేకపోవడం కాదు. క్రీజులో ఎక్కువసేపు ఉండటం బ్యాట్స్మన్కు ముఖ్యం. రోహిత్ బాగానే ఆడుతున్నాడు' అని ధోనీ వివరించాడు.
భారత స్పిన్నర్లు జడేజా, అశ్విన్ గురించి మాట్లాడుతూ.. 'గ్రూప్ మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసే అవకాశాలు జడేజాకు పెద్దగా రాలేదు. జింబాబ్వేతో మ్యాచ్లో అశ్విన్, జడేజా ఇద్దరూ భారీగా పరుగులు సమర్పించుకున్నమాట వాస్తవమే. కానీ అక్కడి బౌండరీలు చాలా చిన్నవి. పైగా టేలర్ అద్భుతంగా ఆడాడు. కాబట్టి ఆందోళన పడాల్సిందేమీ లేదు' అని ధోని తెలిపాడు.
అదరగొడతారు: లక్ష్మణ్
సరైన సమయంలో ఫామ్ అందుకున్న భారత బ్యాట్స్మెన్.. నాకౌట్ దశలో మరింత మెరుగ్గా ఆడతారని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'నాకౌట్కు ముందే భారత బ్యాట్స్మెన్ అంతా మంచి ఫామ్లోకి వచ్చారు' అని లక్ష్మణ్ తెలిపాడు.
'జింబాబ్వేతో మ్యాచ్లో సురేష్ రైనా, ధోని అద్భుతంగా ఆడారు. అన్ని విభాగాల్లోనూ టీమ్ఇండియా బలంగా ఉంది. నాకౌట్లో మనవాళ్లు ఇంకా బాగా ఆడతారు' వివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.