పెర్త్: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఫిట్నెస్ పైన అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రపంచ కప్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ డబుల్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. అయితే, మిగతా మ్యాచులలో మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు.
మంగళవారం నాడు క్రిస్ గేల్ ప్రాక్టీస్కు దూరం అయ్యాడు. అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతూ ప్రాక్టీస్కు దూరం కావడం ఇది మూడోసారి.
దీనిపై జట్టు యాజమాన్యం స్పందిస్తూ.. ఇది పెద్ద నొప్పి కాదని తెలిపింది. శుక్రవారం నాడు భారత్తో వెస్టిండీస్ తలపడనుంది. శుక్రవారం నాటి మ్యాచ్కు క్రిస్ గేల్ సిద్ధంగా ఉండారని యాజమాన్యం తెలిపింది. కాగా, మంగళవారం వెస్టిండీస్ ఆటగాళ్లు ప్రాక్టీస్లో ఉంటే, క్రిస్ గేల్ సెలక్షన్ కమిటీ చీఫ్ క్లీవ్ లాయిడ్తో ఏదో విషయమై మాట్లాడుతున్నాడు.
కాగా, ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడింది. అందులో రెండు గెలిచింది. రెండు ఓడింది. క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం భారత్ మరో మ్యాచులో గెలిస్తే చాలు. అయితే, వెస్టిండీస్ మాత్రం మరో రెండు మ్యాచులు గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్తో జరిగే మ్యాచ్ వెస్టిండీస్కు కీలకంగా మారింది.