న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పైన వివాదం ముసురుకుంది. దీనిపై అతను స్పందించాడు. వ్యాపారవేత్త సంజయ్ నారంగ్ లాండోర్ కంటోన్మెంటులో చేపట్టిన అభివృద్ధి పనుల వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందలేదని సచిన్ స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో తమ తప్పేమీ లేదన్నారు. ఈ మేరకు సచిన్ అధికార ప్రతినిధి ప్రకటన చేసారు. తాను భారత్లోని చట్టానికి నిత్యం కట్టుబడి ఉండే వ్యక్తిని అని చెప్పారు. డీఆర్డీవో నిర్మాణాల పక్కనే ఉన్న ప్రాంతంలో నెలకొన్న వివాదంలో సచిన్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయన స్పందించారు. అయితే, అసలు నారంగ్తో సచిన్కు ఉన్న వ్యాపార సంబంధం ఏమిటన్న విషయాన్ని మాత్రం అందులో వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్తో సచిన్ సమావేశమయ్యారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లాండోర్ కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి విషయమై, ఆస్ట్రేలియాలో ఉన్న సచిన్ అర్ధాంతరంగా తన పర్యటన ముగించుకొని వచ్చారని అంటున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
ఏమిటి వివాదం?
ఉత్తరాఖండ్లో ముస్సోరి ప్రాంతంలోని లాండోర్ కంటోన్మెంట్ ప్రాంతంలో డీఆర్డీవోకు చెందిన పరిశోధనా కేంద్రముంది. ఈ ప్రాంతానికి సమీపంలోని సచిన్ స్నేహితుడు సంజయ్ నారంగ్కు చెందిన రిసార్ట్స్ ఉన్నాయి. అయితే రిసార్ట్స్ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించి పరిశోధనా కేంద్రానికి అతి దగ్గరలో రిసార్ట్స్ నిర్మాణాన్ని చేపట్టారు.
దీంతో కంటోన్మెంట్ యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో సచిన్ కేంద్రమంత్రితో సమావేశమయ్యారని అంటున్నారు.
అంతేకాదు, నారంగ్ వ్యాపారంలో సచిన్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. సచిన్ కేవలం వ్యక్తిగత స్నేహితుడు మాత్రమేనని, గతంలోను, ఇప్పుడు దహిలా బ్యాంకులో ఆయనకు ఎలాంటి వాటాలు లేవని నారంగ్ మరో ప్రకటనలో తెలిపారు. సచిన్ కూడా తనకు వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.