న్యూఢిల్లీ: మానీ లాండరింగ్ కేసులో తప్పించుకుని విదేశాలలో తిరుగుతున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చెయ్యాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఎలాగైనా సరే లలిత్ మోదీని భారత్ రప్పించి విచారణ చెయ్యాలని ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం కేసు విచారణ చేస్తున్న ముంబైలోని పీఎమ్ఎల్ఏ కోర్టులో ఈడీ తరుపు న్యాయవాదులు అర్జీ సమర్పించి మనవి చేశారు.
లలిత్ మోదీ ఐపీఎల్ చీఫ్ గా పని చేసిన సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ లలిత్ మోదీ మీద కేసులు నమోదు చేసింది. తరువాత లలిత్ మోదీని ఆ పదవి నుండి తప్పించారు.
కేసులు నమోదు కావడంతో 2010లో లలిత్ మోదీ లండన్ పరారైనాడు. అప్పటి నుండి అతను విదేశాలలోనే కాలం వెళ్లదీస్తున్నాడు. తనకు భారత్ లో ప్రాణభయం ఉందంటు లలిత్ మోదీ తప్పించుకుంటున్నాడని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.
లలిత్ మోదీ ఇటివల ట్విట్టర్ లో చేసిన ట్విట్లతో బీజేపీకి తలనొప్పిగా తయారైనాడు. లలిత్ మోదీ వ్యవహారం లోక్ సభలోను దద్దరిల్లుతున్నది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుస్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాజీనామాలు చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.