న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్కు (సిఎస్కే) ఆడకపోవడంపై ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్లో ధోనీ గత ఏడాది వరకు సిఎస్కేకు ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను కొత్త జట్టు రైసింగ్ పుణే సూపర్ జెయింట్స్కు ఆడనున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ధోనీ ఎనిమిదేళ్లు ఆడాడు. అతను కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ జట్టు పైన వేటు పడటంతో అతను కొత్త టీంకు వచ్చాడు. కొత్త జట్టు యజమాని సంజీవ్ గోయెంకతో కలిసి ధోనీ తమ జట్టు జెర్సీని విడుదల చేశాడు.
ఈ సందర్భంగా ధోనీ ఎమోషనల్ అయ్యాడు. తనకు చెన్నై సూపర్ కింగ్స్తో ఎనిమిదేళ్ల అనుబంధముందని, ఆ జట్టుతో తనకు ఎమోషనల్ కనెక్ట్ ఉందని చెప్పాడు. ఎనిమిదేళ్ల పాటు ఓ జట్టుకు ఆడాక.. ఇప్పుడు మరో జట్టుకు ఆడటం అంటే ఏదో డిఫరెంట్గా అనిపిస్తోందన్నాడు.
అయితే, తాను కొత్త జట్టుకు ఆడేందుకు ఉత్కంఠతో ఉన్నానని చెప్పాడు. ఓ ప్రొఫెషనల్ ఆటగాడిగా పుణే జట్టు తనను తీసుకోవడం పట్ల ఆ జట్టుకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. కెప్టెన్గా, ఆటగాడిగా తాను వంద శాతం జట్టుకు న్యాయం చేస్తానని చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీతో పాటు సురేష్ రైనా, రవీంద్ర జడెజా, బ్రెండన్ మెకల్లమ్ తదితరులు కూడా ఉండేవారు. దీనిపై ధోనీ స్పందిస్తూ... తాను ఎంతోమంది ఆటగాళ్లను మిస్ అవుతున్నానని చెప్పాడు. తామంతా ఒకే జట్టులో ఎనిమిదేళ్ల పాటు ఉన్నామని చెప్పాడు.
ఇప్పటికే పాత ఆరు ఫ్రాంచైజీలు సెటిల్ అయి ఉన్నాయని, తద్వారా కొత్తగా వచ్చిన రెండు ఫ్రాంచైజీల పైన ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. కొత్త జట్లు సర్దుకోవాల్సి ఉందన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరు తమ తమ వంతు పాత్ర పోషిస్తారని చెప్పాడు.