కోల్కతా: ప్రస్తుత సీజన్లో సొంత గడ్డపై తొలి విజయం కోసం అట్లెటికో డీ కోల్ కతా వేచి చూస్తున్నది. ఢిల్లీ డైనమోస్తో శనివారం కోల్ కతాలోని రవీంద్ర సరోవర్ స్టేడియం వద్ద జరిగే మ్యాచ్ పైనే అందరి ద్రుష్టి పడింది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య జరిగిన 4 మ్యాచ్లలో మూడింటిని డ్రాగా ముగించగా, ఒక మ్యాచ్ లో కోల్ కతా గెలుచుకున్నది.
ప్రస్తుత సీజన్ లో రెండు వరుస డ్రాలతోపాటు కేరళ బ్లాక్ బస్టర్స్పై మాత్రమే అట్లెటికో డీ కోల్ కతా గెలుపొందింది. ఇక ఢిల్లీ డైనమోస్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్తో జరిగిన మ్యాచ్లో విజయం తప్ప ఇప్పటివరకు డైనమోలు మరో మ్యాచ్లో విజయం సాధించలేదు.
2014 ఐఎస్ఎల్ చాంపియన్ అయిన అట్లెటికో డీ కోల్కతా ఇప్పటివరకు ఢిల్లీ డైనమోస్ తో జరిగిన ఒక్క మ్యాచ్ లోనూ గెలుపొందలేదు. తొలి ఎడిషన్ లో 1- 1, 0 - 0 స్కోర్ తేడాతో, 2015లో ఒక మ్యాచ్ లో 1 - 1 స్కోర్ తేడాతో డ్రాగా ముగించాయి.
రిచర్డ్ గాడ్జే, బాదారా బాద్జీ, ఫ్లోరెంట్ మాలౌదా, కియాన్ లూయిస్ మాదిరిగా కోల్కతా కుర్రాడు అర్నాబ్ మొండాల్ బిజీబిజీగా ఉంటాడు. అయితే ఈ సీజన్లో ప్రతి నిమిషంలోనూ కోల్కతాకు గల ఏకైక డిపెండర్ అర్నాబ్ మొండాల్ మాత్రమే. ప్రస్తుత సీజన్లో సొంతగడ్డపై కోల్కతా విజయం సాధించాలంటే ఈ దఫా మొండాల్ తన శక్తియుక్తులను, బలగాన్నిప్రత్యర్థి జట్టుపై ప్రయోగించేందుకు సమయం ఆసన్నమైంది.
ఇక ఢిల్లీ డైనమోస్ కుర్రాళ్లలో రిచర్డ్ గాడ్జే కిక్ సాధించడంపైనే ద్రుష్టిని కేంద్రీకరించాడు. ముంబై సిటీతో జరిగిన మ్యాచ్ 3 - 3 స్కోర్ తో డ్రాగా ముగించడంలో గాడ్జే పాత్ర కీలకం. ముంబైతో జరిగిన మ్యాచ్లో మూడు గోల్స్ కూడా గాడ్జే చేసినవే గమనార్హం. సహకరించడం, పెనాల్టీని గోల్గా మార్చడంలోనూ దిట్టగా మారిన గాడ్జే కోల్కతాకు వ్యతిరేకంగా అదే పెర్ఫార్మెన్స్ సాధిస్తాడని ఆశలు భావిస్తున్నారు.
ఐఎస్ఎల్ తొలి ఎడిషన్ నుంచి కొనసాగుతున్న కోల్కతా మిడ్ ఫీల్డర్ బొర్జా ఫెర్నాండెజ్.. ఢిల్లీ డైనమోస్పై విజయం సాధించాలంటే ఈ సీజన్ లోనూ అదే టెంపో కొనసాగించాల్సిన అవసరం ఉంది. క్రితం సారి గోవాకు పెనాల్టీ గోల్ సమర్పించుకున్న బొర్జా.. దానికి ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నాడు.
ముంబైకి వ్యతిరేకంగా తన స్పిరిట్ను రుజువుచేసుకున్న ఢిల్లీ కుర్రాడు ఫ్లోరెంట్ మాలౌడా 2015లో తన ఇంద్రజాల మహిమతో జట్టు 8 గోల్స్ చేయడంలో సహకరించాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క గోల్ మాత్రమే చేసిన కోల్ కతా ప్లేయర్ ఇయాన్హుమ్.. ఢిల్లీపై తన ప్రతిభను కనబర్చుకోవాల్సిన అవసరం ఉంది.
గతేడాది అట్లెటికో డీ కోల్ కతా ఆరో మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు 11 సార్లు ఆడినా ఇయాన్ హుమ్ గోల్స్ చేసిన దాఖలాలు లేవు. ముంబైకి వ్యతిరేకంగా ఢిల్లీ తరఫున తొలిసారి ఆడుతున్న ఇబ్రహిమా నియాస్ స్ఫూర్తిదాయక ఆటగాడు. రెండు బ్లాకుల్లోనూ విజయవంతంగా ఆటను చక్కబెట్టగల నేర్పు ఆయన సొంతం.
తిరి, నాటో రెడి
అట్లెటికో డీ కోల్ కతాకు గొప్ప ఉపశమనాన్నిచ్చే వార్త. డిఫెండర్ తిరి, మిడ్ ఫీల్డర్ ఆఫెంట్సే నాటోలు ఢిల్లీతో శనివారం జరిగే మ్యాచ్ లో కోల్కతా తరఫున ఆడనున్నారు. నాటో, తిరి అందుబాటులో ఉన్నారని, కానీ సారధి హెల్డర్ పోస్టిగ మ్యాచ్ లో పాల్గొనలేడని కోచ్ జోస్ మొలీనా తెలిపాడు.
స్పానిష్ డిఫెండర్ తిరిగి.. చెన్నైయిన్ తో జరిగిన మ్యాచ్లో ఆడగా, ఇంకా నాటో ఆటలోకి రానేలేదు.తాను గతం గురించి ఆలోచించనని, తదుపరి మ్యాచ్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ద్రుష్టి సారిస్తానని తిరి తెలిపాడు. ప్రస్తుతం తాము ఆరుపాయింట్లు కలిగి ఉన్నామని, ఢిల్లీతో జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటామన్నాడు.
ఢిల్లీ కోచ్ జియాంలుకా జంబ్రొట్టా సైతం అట్లెటికో డీ కోల్కతాతో జరిగే మ్యాచ్ పోటాపోటీగా, బాలెన్సింగ్గా ఉంటుందన్నారు. ఈ మ్యాచ్ ఫలితం ఎవరికి తేలిక కాదన్నాడు. ఐఎస్ఎల్ ప్రగతి పథంలో దూసుకెళుతున్నదన్న జంబ్రొట్టా.. అతి త్వరలో ప్రపంచ ఫుట్బాల్ లీగ్ల్లో ఒకటి కానున్నదని పేర్కొన్నాడు.
సమతూకం పాటించడంతోపాటు ఆటలో క్వాలిటీ పెంపుదలకు ప్రస్తుతం ఆరుగురు విదేశీ ఆటగాళ్లు, ఐదుగురు భారతీయులను అనుమతినిస్తున్న సిస్టమ్ బాగానే ఉన్నదన్నాడు. దేశీయ ఫుట్ బాల్ ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రతి క్లబ్ జట్టులో భారతీయ ఆటగాళ్ల సంఖ్య పెంచాలని నిర్వాహకులు భావిస్తున్ననేపథ్యంలో జంబ్రొట్టా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే ఇటీవలే నార్త్ఈస్ట్ కోచ్ నెలో వింగాడ మాత్రం జంబ్రొట్టా వాదనతో విభేదిస్తూ ఆరుగురు/ ఏడుగురు భారతీయులు, నలుగురు / విదేశీ ఆటగాళ్లు ఉంటే భారత్ పుట్ బాల్ ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొనడం గమనార్హం.
కోల్కతా ప్రధాన కోచ్ జోస్ మొలీనా మాత్రం తమ కుర్రాళ్లు నెమ్మదిగా ముందుకు దూసుకెళ్తున్న వైనం గురించి ఎటువంటి ఆందోళన చెందడం లేదన్నాడు. నార్త్ఈస్ట్ కంటే ఒక్క పాయింట్ మాత్రమే తాము వెనుకబడి ఉన్నామని మొలీనా మీడియాకు గుర్తుచేయడం గమనార్హం. శనివారం జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే మూడు పాయింట్లు అదనంగా వస్తాయని, అలాగని ఓటమి పాలైనా తమ జట్టు స్థానానికి ఢోకా లేదన్నాడు.