న్యూఢిల్లీ: ఫిఫా ఆద్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అండర్ 17 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1.1 కోట్ల మంది బాలలకు ఫుట్బాల్ ఆటలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపాడు.
యుఫ్లెక్స్ స్టయిర్స్ స్కూల్ ఫుట్ బాల్ లీగ్ మూడో ఎడిషన్ ప్రారంభోత్సవంలో గోయల్ మాట్లాడుతూ క్రీడల అభివ్రుద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వ విజన్ను బయటపెట్టారు. జాతీయంగా క్రీడలను ప్రోత్సహించడంతోపాటు అభివృద్ధి పర్చడానికి ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగతంగా ఎంతో ఆసక్తి చూపుతున్నారన్నారు.
యుఫ్లెక్స్ స్టయిర్స్ స్కూల్ ఫుట్ బాల్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. భారత్ లో ఫుట్ బాల్ ఆటపట్ల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు స్టయిర్స్ సెక్రటరీ జనరల్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఉపాధ్యాయ్ను అభినందించారు. తాను విద్యార్థిగా ఎన్సిసిలో పనిచేసినప్పుడు ఖోకో, బాస్కెట్ బాల్, టెన్నిస్ ఆడేవాడినని, క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి, అభిరుచి పెంపొందించుకోవాలని విజయ్గోయల్ సూచించాడు.
ఫుట్బాల్ పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని, జాతీయ ఐక్యతను పెంపొందిస్తుందని చెప్పాడు. కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ఫుట్ బాల్ ఆడే విధంగా ప్రధాని నరేంద్రమోడీ వద్ద విజన్ ఉందని చెప్పారు. అన్ని ఫుట్ బాల్ క్లినిక్కులతో, అకాడమీలతో కలిసి పనిచేస్తూ దేశంలో ఆ ఆటకు మద్దతు పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.
గోవాకు ఫిఫా గ్రీన్ సిగ్నల్
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్న ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్ లు నిర్వహించే స్టేడియంల జాబితాలో కోచి, నవీ ముంబైలతోపాటు గోవా చేరిపోయింది. 13 మంది సభ్యుల ఫిఫా ప్రతినిధి బ్రుందం, స్థానిక ఆర్గనైజింగ్ (ఎల్వోసీ) కమిటీ సభ్యులతో కలిసి శనివారం గోవాలోని స్టేడియంలను సందర్శించి.. అక్కడ వసతులు, ఇతర ఏర్పాట్లను తనిఖీచేసింది.
గోవా స్టేడియంలలో ఏర్పాట్లపై కమిటీ సంత్రుప్తి వ్యక్తంచేసింది. మ్యాచ్ ల నిర్వహణకు, జట్ల ప్రాక్టీస్కు వీలుగా స్టేడియంలు సిద్ధంగా ఉన్నాయని ధ్రువీకరించారు. ఏర్పాట్లు బేష్షుగ్గా ఉన్నాయని టోర్నమెంట్ డైరెక్టర్ జావియర్ చెప్పి వ్యాఖ్యానించాడు. స్థానిక స్టేడియం నిర్వాహకులు చాలా ఉన్నతస్థాయి మౌలిక వసతులు కల్పించడం తమకు విశ్వాసం కలిగించిందన్నారు. ఫిఫా బ్రుందం సోమవారం ఢిల్లీని సందర్శిస్తుంది.
లా లీగా.. మోస్ట్ వ్యూడ్ లీగ్
సోషల్ నెట్వర్క్ వెబ్సైట్ 'యు ట్యూబ్'లో అంతర్జాతీయంగా అత్యధికంగా ప్రజలు వీక్షించిన లీగ్గా స్పెయిన్ ఫుట్ బాల్ లీగ్ 'లా లీగా' ఎంపికైంది. ప్రతి నెలలో లా లీగా లీగ్ మ్యాచ్ లను 203 కోట్ల మంది యు ట్యూబ్ లో వీక్షిస్తున్నారు. లా లీగా గణాంకాల ప్రకారం వివిధ సోషల్ నెట్వర్క్స్లలో 106 కోట్ల మంది చురుగ్గా అనుసరించే వీక్షకులు ఉన్నారు.
ఈఫె నివేదిక ప్రకారం ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్)ను 90 కోట్ల మంది మాత్రమే వీక్షిస్తున్నారు. లా లీగా గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ జనరల్ డైరెక్టర్ ఇగ్నాసియో మార్టినెజ్ త్రుజిల్లో మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం తాము 'యు- ట్యూబ్'లో చాంపియన్ షిప్ టోర్నీని ప్రవేశపెట్టామన్నారు. దీంతో వినియోగదారుల సహకారంతో ప్రతి నెలలో 203 కోట్ల మంది వీక్షిస్తున్నారన్నాడు.