పారిస్: భారత్ ఫుట్బాల్ను ప్రగతిపథంలో అభివృద్ధి పరిచేందుకు జరుగుతున్న మహత్తర కార్యంలో యూరప్లో టాప్ ఫుట్బాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పారిస్ సెయింట్ - జెర్మైన్ (పిఎస్జి) భాగస్వామి కావాలని తలపోస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్కు ప్రీ సీజన్ శిక్షణ కోసం ఓ జట్టును పంపనున్నది. భారత్ లోని రెండు అకాడమీలతోనూ కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నది. భారత్ తోపాటు కొన్ని ఏషియాన్ దేశాలకూ కూడా తన సేవల విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నది.
తద్వారా తనకు గల ఫ్యాన్ ఫేర్ను, బ్రాండ్ వాల్యూనూ పెంపొందించుకోవాలన్నది తమ ప్రధాన అభిమతం అని పిఎస్జి జనరల్ మేనేజర్ ఫ్రెడెరిక్ లాంగ్యూపీ వ్యాఖ్యానించారు. ఆసియా ఖండంలో గల విస్త్రుతమైన మార్కెట్ వాల్యూను తన బ్రాండ్ ద్వారా సొమ్ముచేసుకోవడమే పిఎస్జి లక్ష్యమన్నారు. భారత్ ఫుట్ బాల్ ఆటలో మమేకం కావడానికి ఆ దేశంలోని ఓ అతిపెద్ద సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కానీ ఆ సంస్థ పేరేమిటో మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం.
ఆ కంపెనీ డిజిటల్ రంగంలోనూ, ఫీల్డ్ లోనూ తన బ్రాండ్ ను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. సహనంతో ముందుకెళుతున్న తాము భారత్ లో తమ భాగస్వామ్యం బలోపేతం అయ్యే నాటికి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతామన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి సప్త క్లబ్ల్లో ఒకటిగా ఉన్న పిఎస్జి.. రీయనింగ్ లీగ్ 1 చాంపియన్. ఆదాయంతోపాటు గత నాలుగేళ్లుగా యుఈఎఫ్ఎ చాంపియన్స్ లీగ్లో సెమీ ఫైనల్స్ వరకు దూసుకొస్తున్నక్లబ్గా కూడా పేరొందింది.
భారత్, చైనా, ఇండోనేషియా తదితర ఆసియా ఖండ దేశాల్లో ఫుట్ బాల్ పట్ల గల ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు తన బ్రాండ్ను ప్రమోట్ చేయాలని పిఎస్ జి తలపోస్తున్నది. ఈ క్లబ్ భారత్లోని గుర్గావ్, బెంగళూరు ఫుట్ బాల్ అకాడమీలను నడుపుతున్నది. తద్వారా భారత్ లో క్షేత్రస్థాయిలో ఫుట్ బాల్ ను అభివ్రుద్ధి చేయగలుగుతున్నది. అందువల్లే భారత్ ఫుట్ బాల్ కు అంతర్జాతీయంగా మార్కెట్ లభించింది. తమ తదుపరి చర్యలు, ప్రణాళికలేమిటన్నది పిఎస్ జి ఇంకా నిర్ణయించుకోలేదు.
2017 నుంచి 2019 లోగా భారత్ కు యూత్ టీమ్ ను గానీ, పూర్తిగా నైపుణ్యం గల జట్టును గానీ పంపాలని ప్రణాళికలు రూపొందించామని, నెమ్మదిగా భారత్ లో ఫుట్ బాల్ ఆటకు ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆసియా జర్నలిస్టులతో మాట్లాడుతూ లాంగ్యూ పీ చెప్పారు. యూత్ జట్టా, మహిళల జట్టా అన్న దాంతో నిమిత్తం లేకుండా అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.
భారతీయ సంస్క్రుతి, సంప్రదాయాలను తెలుసుకొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, వేగంగా దూసుకెళ్లాలని గానీ, ఫ్రెండ్లీ గేమ్స్ లో పాల్గొనాలని గానీ తమకు ఆసక్తి లేదన్నారు. వచ్చే ఏడాది భారత్ లో జరిగే ఫిఫా యు - 17 ప్రపంచ కప్ పలు మార్పులు తీసుకొస్తుందన్నాడు. దేశవ్యాప్తంగా విభిన్న మార్గాల్లో పలు క్లబ్ల ద్వారా ఫుట్ బాల్ మ్యాచ్ల నిర్వహణ ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వరుసగా మూడో ఎడిషన్ విజయవంతంగా నిర్వహిస్తుండటమే దీనికి కారణమన్నారు.
భారత్ ఫుట్బాల్లో తమ ప్రవేశానికి పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయని లాంగ్యూపీ తెలిపారు. అందులో ఒకటి భారత్ లోని ఓ క్లబ్ జట్టును కొనుగోలు చేయడమని చెప్పారు. తమకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోబోమని స్పష్టంచేశారు. కుర్రాళ్లను భారీగా ఫుట్బాల్ ఆడేందుకు ఆకర్షించడమే తమ విధానం అని అన్నారు.
భారతీయులకు పిఎస్జి దీపావళి శుభాకాంక్షలు
అభిమానులతో అనుసంధానం అయ్యేందుకు ఫ్రెంచ్ ఫుట్ బాల్ జెయింట్స్ 'పారిస్ సెయింట్ జెర్మైన్' భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. సోమవారం ఒలింపిక్యూ డీ మార్సైల్లీతో లీ క్లాసిక్యూ మధ్య మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో పిఎస్ జి ముందస్తుగా భారతీయులను గ్రీట్ చేసింది. 48 వేల మంది అభిమానులు హాజరు కానున్న ఈ మ్యాచ్ జరిగే స్టేడియం (పార్క్ డెస్ ప్రిన్సెస్)లో 'హ్యాపీ దీపావళి' అని శుభాకాంక్షలు తెలుపుతూ హిందీలో రాసిన అక్షరాలు ఎల్ఈడి లైట్ ద్వారా చూడొచ్చు.