ఛండీఘర్: గురుదాస్పూర్ ఎదురుకాల్పుల ఘటనలో ఉగ్రవాదులను మట్టుపెట్టిన బృందంలో మాజీ హాకీ ఆటగాడు, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ జుగ్రాజ్ సింగ్ కూడా కీలక భూమిక పోషించారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన బృందంలో 32ఏళ్ల జుగ్రాజ్ కూడా ఉన్నారు.
హాకీ నుంచి రిటైరైన తర్వాత జుగ్రాజ్ సింగ్ పంజాబ్ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అమృత్సర్లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్ పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్పై ఉగ్రవాదులు దాడి చేశారని, టెర్రరిస్టులను తుద ముట్టించే ఆపరేషన్లో పాల్గొనాలని పైఅధికారుల నుంచి సందేశం అందింది.
వెంటనే టీమ్తో కలసి సంఘటనా స్థలానికి ఉదయం 8.15గంటలకు చేరుకున్నారు. అక్కడ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో పాల్గొన్నానని జుగ్రాజ్ ఆదివారం చెప్పారు. పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో నక్కిన ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించినట్టు ఈ మాజీ హాకీ ప్లేయర్ తెలిపారు. ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉన్నట్లు చెప్పారు.
గురుదాస్పూర్లో ఉగ్రవాదుల జరిపిన దాడుల్లో ఓ ఎస్పీతోపాటు పది మంది పోలీసులు, సామాన్య ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు, సైనిక దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.
కాగా, 2003లో జలంధర్లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన జుగ్రాజ్ హాకీ నుంచి రిటైరయ్యారు. కొన్ని రోజులు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించి హాకీ మెళకువలను ఆటగాళ్లకు నేర్పించారు. ఆ తర్వాత పోలీస్ అధికారికగా బాధ్యతలు చేపట్టారు.