సిడ్నీ: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయంపాలైన ఇంగ్లాండ్ జట్టుపై ఆ దేశ మీడియా దుమ్మెత్తిపోసింది. ప్రపంచ కప్ టోర్నీలో ఆడినది చాలు, ఇక ముఠాముళ్లే సర్దుకొని ఇంటికి వచ్చేయండని ధ్వజమెత్తింది. ఇయాన్ మోర్గాన్, అతని జట్టు చెత్త ప్రదర్శనను చూడలేకపోతున్నామని పేర్కొంది.
డెయిలీమెయిల్ కథనం ప్రకారం.. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన చిన్న పిల్లల ఆటలా ఉందని తెలిపింది. గెలవాలనే కోరికతో జట్టు ఆడినట్లు కనిపించలేదని పేర్కొంది. ప్రపంచ కప్ టోర్నీలో చెత్త ప్రదర్శన ఇవ్వడం ఇంగ్లాండ్ జట్టుకు ఇదే మొదటి సారి కాదని, గతంలో కూడా ఇలాంటి ఆటతీరునే కనబర్చారని మండిపడింది.
బిబిసి కూడా ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'శ్రీలంక థమ్స్ సారీ ఇంగ్లాండ్' అనే శీర్షికన ఓ కథనాన్ని ప్రచురితం చేసింది. 'ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో తలపడిన మ్యాచుల్లో ఓటమిని, స్కాట్లాండ్పై గెలుపు ఊహించిందే. అయితే ఇంగ్లాండ జట్టుపై కొంత ఆశలు ఉండేవి. శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఘోర పరాజయం పాలైన తర్వాత ఇంగ్లాండ్పై ఎలాంటి ఆశలు లేకుండా పోయాయి' అని పేర్కొంది.
ప్రస్తుతం పూల్-ఏలో ఇంగ్లాండ్ జట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది. అది కూడా ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్ల కింది స్థానంలో. దీంతో ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఒకవేళ ఇంగ్లాండ్ క్వార్టర్స్కు చేరుకున్నా.. అక్కడ మ్యాచులు గెలిచే అవకాశం లేదని మాజీ క్రికెటర్ జేఫ్రీ బాయ్కాట్ పేర్కొన్నాడు.
కాగా, ఇంగ్లాండ్ అభిమానులు తమ జట్టుపై ఆశలు వదులుకున్నారు. 'ఇంటి దగ్గరికొచ్చి పోరాటం చేయండి. వెల్లింగ్టన్ నుంచి లండన్ ఖర్చైన మార్గమేమి కాదు' అని అభిమానులు ట్విట్టర్లో తమ జట్టుపైనే వ్యంగ్యంగా రాసుకుంటున్నారు. 'ఎలాంటి ఆందోళన అవసరం లేదు. వచ్చే ఇరవేళ్లలో మనం ప్రపంచ కప్ గెలుస్తాం' అంటూ తమ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా మోర్గాన్ జట్టు మార్చి 9న అడిలైడ్లో జరిగే మ్యాచులో బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. మార్చి 13న ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో ఆడనుంది. ఈ రెండు చిన్న జట్లే అయినప్పటికీ ఇంగ్లాండ్ అభిమానులు మాత్రం తమ జట్టు గెలుస్తుందనే నమ్మకాన్ని మాత్రం వ్యక్తం చేయడం లేదు.