హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరిలో గౌహతిలో జరిగిన SAFF గేమ్స్లో మహిళల స్విమ్మింగ్ బ్రెస్ట్ స్ట్రోక్, వ్యక్తిగత మెడ్లేలో సయానీ ఘోష్ భారత్కు రెండు బంగారు పతకాలను అందించింది. గత 20 ఏళ్లలో బెంగాల్కు బంగారు పతకాలను అందించిన ఈ 16 ఏళ్ల క్రీడాకారిణి ఇప్పుడు తనను ఆర్ధికంగా ఆదుకునే వారికోసం ఎదురుచూస్తోంది.
కోల్కత్తా నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో హౌరా జిల్లాలో ఉన్న బాలి అనే ప్రాంతంలో సయానీ నివసిస్తోంది. తన తల్లిదండ్రులతో ఓ చిన్న గదిలో నివసిస్తోన్న సయానీకి అదే ప్రాంతంలో నివసిస్తోన్న బంధువుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటోంది. దీనికి కారణం సయానీ ఎదుగుదలను చూసిన బంధువులు ఓర్వలేకపోవడమే.
తన సక్సెస్ని చూసి ఓర్వలేని బంధువులు పలుమార్లు తనపై దాడికి కూడా ప్రయత్నించారని సయావీ వివరించింది. వారి దాడి నుంచి తప్పించుకన్నప్పటికీ, ఈ ప్రాంతం నుంచి వేరొక చోటుకి వెళ్లేందుకు తగిన ఆర్ధిక స్తోమత లేదని సయానీ మీడియాతో వాపోయింది.
వారు నివసిస్తోన్న ఇంటికి సమీపంలో ఓ పుట్ పాత్పై రోల్ సెంటర్ని సయానీ తండ్రి శ్యామల్ ఘోష్ నిర్వహిస్తున్నాడు. ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్స్లో పాల్గొనే స్విమ్మర్లు ధరించి వదిలేసిన స్విన్ సూట్స్నే సయావీ వేసుకుంటుందంటే ఆమె ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోండి.
SAFF గేమ్స్లో బంగారు పతకాలను సాధించినందుకు గాను ఈస్ట్ బెంగాల్ క్లబ్ తనని సన్మానించి బహుమతిగా ఇచ్చిన రూ. లక్ష రూపాయల అనంతరం సయానీ సొంతంగా స్విమ్మింగ్ దుస్తులను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సయానీ తల్లి మౌషుమి ఘోష్ వెల్లడించింది.
2005లో స్విమ్మింగ్ని నేర్చుకోవడం మొదలుపెట్టిన సయానీ ఆ తర్వాత మాజీ జాతీయ స్విమ్మర్, కోచ్ సురజిత్ గంగూలీ వద్ద స్విమ్మింగ్ పాఠాలను నేర్చుకుంది. ఆ తర్వాత స్విమ్మింగ్లో రాణించింది. ఒలింపిక్స్లో భారత్ తరుపున ప్రాతనిధ్యం వహించాలనేది తన కోరిక అని సయానీ పేర్కొంది.
దానిని దృష్టిలో పెట్టుకుని రోజులు నాలుగు గంటల పాటు కష్టపడుతున్నానని సయానీ వెల్లడించింది. ప్రస్తుత తానున్న పరిస్థితుల్లో తనకు ఓ ఉద్యోగం కావాలని, లేకపోతే తాను వేరొక చోటికి వెళ్ళడం కష్టం అవుతుందని తెలిపింది. SAFF గేమ్స్లో బంగారు పతకాలు సాధించిన అనంతరం కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ సయానీకి నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని వాగ్దానం చేసినా, ఇప్పటికీ ఆమెకు రాలేదు.