న్యూఢిల్లీ : 'చదువుకోకపోతే ఎందుకూ పనికిరాకుండా పోతావ్'!. అత్తెసరు మార్కులతో.. చదువులో ఎప్పుడూ వెనుకబడి ఉండే స్టూడెంట్స్ ను ఉద్దేశించి తల్లిదండ్రులు, టీచర్స్ తరుచూ మాట్లాడే మాటలివి. అయితే చదువు అంతగా అబ్బక పోవడం మూలాన్నే.. ఈరోజు తానో స్థాయికి చేరుకున్నానని చెబుతున్నాడు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్.
ఒలింపిక్స్ లో తన శిశ్యురాలు సింధు జయకేతనం ఎగిరేయడంతో ఇప్పుడాయన పేరు మరింతగా మారుమోగిపోతుంది. ఇదే క్రమంలో న్యూఢిల్లీలోని ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న గోపిచంద్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్లే ఈరోజు కోచ్ గా తాను అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చుకున్నాని చెప్పాడు గోపిచంద్.
గోపిచంద్ మాట్లాడుతూ.. 'చిన్నతనంలో నేను, నా సోదరుడు చాలా ఆటలు ఆడేవాళ్లం. నా సోదరుడు అప్పట్లో స్టేట్ ఛాంపియన్. ఐఐటీ పరీక్ష రాశాక.. సీటు రావడంతో ఆటలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంజనీరింగ్ లో చేరిపోయాడు. నేను మాత్రం ఇంజనీరంగ్ పరీక్షలో ఫెయిల్ అయ్యాను. దీంతో క్రీడలను కొనసాగించే అవకాశం వచ్చి, ఇప్పుడీ స్థాయిలో ఉన్నా. చదువులో అంత యాక్టివ్ గా ఉండలేకపోవడం తనకు కలిసొచ్చినట్లుగా' చెప్పుకొచ్చాడు.
ఇటీవలే కేంద్రం నుంచి గోపిచంద్ పద్మభూషణ్ అవార్డును స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ గెలిచిన రెండో భారతీయుడిగా గోపిచంద్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆటగాడిగా రిటైర్డ్ అయి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసిన గోపిచంద్.. సైనా, సింధు లాంటి క్రీడాకారులను భారత్ కు అందించారు.
అకాడమీ విషయంలో ఎన్నో కష్టాలు :
అకాడమీని ఏర్పాటు చేయడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు గోపిచంద్. తన కుటుంబంతో అండతో పాటు పలువురు ఆర్థిక చేయూతనివ్వడంతో.. అకాడమీ ప్రారంభించగలిగానని తెలిపాడు. 2004లో 25మంది పిల్లలతో అకాడమీ ప్రారంభించినట్లు చెప్పాడు గోపిచంద్. 8ఏళ్ల వయసులో సింధు తన దగ్గర కోచింగ్ కోసం చేరినట్లు తెలియజేశాడు. ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ పతకం సాధించాలన్న తన కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు గోపిచంద్. కాగా, ఈ సన్మాన కార్యక్రమానికి సింధు తండ్రి పీవీ రమణ కూడా హాజరయ్యారు.