న్యూఢిల్లీ: ఇప్పుడిప్పుడే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న భారత్ హాకీలో కలకలం రేగింది. హాకీ జట్టు ప్రధాన కోచ్ టెర్రీ వాల్ష్ మంగళవారం ఆయన పదవికి రాజీనామా చేశారు. వేతన విషయంలో భారత క్రీడా ప్రాధికార సంస్దతో వివాదం కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నట్లు వాల్ష్ తెలిపారు.
60ఏళ్ల ఆస్ట్రేలియా హాకీ మాజీ ఒలంపియన్ తన రాజీనామా లేఖను సాయ్ డైరెక్టర్ జనరల్ జిజి థామ్సన్కు పంపగా... తొలుత ఆయన ఆమోదించారు. ఆ తర్వాత వాల్ష్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని.. ఆయన సేవలను కొనసాగిస్తామని తర్వాత మరో ప్రకటనలో పేర్కొన్నారు.
2016 రియో ఒలంపిక్స్ వరకు హాకీ ఇండియాతో వాల్ష్ కు ఒప్పందం ఉంది. "భారత పురుషుల హాకీ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నా. నా రాజీనామా లేఖను సాయ్ కి పంపించా. భారత క్రీడా ప్రాధికార సంస్ధలోని అధికారుల నిర్ణయాలు నచ్చడం లేదు."
"నాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వేతనం ఇచ్చే విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. అంతేకాక పదే పదే ప్రయాణాలు చేయాల్సి రావడం, కుటుంబానికి దూరం ఉండటం కూడా ఒత్తిడికి గురి చేస్తోంది. నా ఒప్పంద సమస్యల్ని సాయ్ పరిష్కరించి కొత్త కాంట్రాక్ట్ ఇస్తే కొనసాగే విషయాన్ని ఆలోచిస్తా" అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
వాల్ష్ రాజీనామా చేయడం షాక్కు గురి చేస్తొందని అతని నుంచి ఈ నిర్ణయాన్ని ఊహించలేదని హాకీ ఇండియా అధ్యక్షుడు నరిందర్ బత్రా చెప్పాడు. ఇది ఇలా ఉంటే వాల్ష్ రాజీనామాపై క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇవ్వాలని భారత స్పోర్ట్ అధారిటీని కోరింది. దీంతో సర్వత్రా విమర్శలు రావడంతో సాయ్ వెనక్కి తగ్గింది. వాల్ష్ తో మాట్లాడాం. సాయ్తో అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. వాల్ష్ తో పని చేయాలని కోరుకుంటున్నామని సాయ్ తెలిపింది.
రాజీనామా విరమించుకున్న భారత హాకీ కోచ్
భారత పురుషుల జట్టు హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా విరమించుకున్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తో సమావేశమై మాట్లాడిన అనంతరం ఆయన తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గాడు. వేతన ఒప్పందం విషయంలో భారత క్రీడా ప్రాధికార సంస్థతో వివాదం కారణంగా పదవి నుంచి వైదొలగుతున్నట్లు నిన్న(మంగళవారం) వాల్ష్ ప్రకటించాడు.