హైదరాబాద్: హైదరాబాదీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్లో సభ్యురాలిగా సైనా నెహ్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాష్ నుంచి సైనా నెహ్వాల్ సోమవారం (అక్టోబర్ 17)న లేఖ అందుకుంది.
'అథ్లెట్స్ కమిషన్ ఛైర్పర్సన్తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. రియో ఒలింపిక్స్ 2016 తర్వాత కమిషన్ సభ్యురాలిగా సైనాను నియమించడం చాలా సంతోషం' అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఏంజెలా రుగీరో అధ్యక్షతన ఏర్పాటైన ఈ అథ్లెట్స్ కమిషన్లో 9 మంది వైస్ ప్రెసిడెంట్లు, 10 మంది సభ్యులుగా ఉన్నారు.
కమిషన్ తదుపరి సమావేశం నవంబర్ 6న జరగనుంది. మోకాలి ఆపరేషన్ ఆనంతరం ఇటీవలే కోలుకుని ప్రాక్టీసుకు సిద్ధమైన వేళ సైనా నెహ్వాల్ను ఈ పదవి వరించడంతో సంతోషిస్తున్నారు. సైనా నియామకంపై ఆమె తండ్రి హర్వీర్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
'ఉద్విగానికి లోనయ్యా. సైనాను కమిషన్ సభ్యురాలిగా నియమించడం సంతోషంగా ఉంది. సైనా ప్రతిభను ఒలింపిక్ కమిటీ గుర్తించింది. గాయం కారణంగానే రియోలో ఆమె పతకం కోల్పోయింది. ఆమెను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది' అని హర్వీర్ సింగ్ అన్నారు.