జకార్తా:ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నిలో భారత ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్ సంచలన ఆటతీరు ప్రదర్శించారు. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
గురువారం నాడు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో ప్రపంచ 29, ర్యాంకర్ ప్రణయ్ 21-10, 21-18తో ప్రపంచ మాజీ నెంబర్ 1, టాప్ సీడ్ లీ చోంగ్ వీ ( మలేషియా) పై వరుస గేమ్ ల్లో గెలుపొందారు. 40 నిమిషాలపాటు జరిగిన ఈ గేమ్ లో భారత ప్లేయర్ ఆధిపత్యం కొనసాగింది.
తొలిగేమ్ ఆరంభంంలో 6-0 శుభారంభం చేసిన ప్రణయ్ క్రమంగా తన ఆధిపత్యాన్ని 10-3 కు పెంచుకొన్నాడు. అదే జోరులో ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతూ ఆ గేమ్ ను తన స్వంతం చేసుకొన్నాడు.
రెండో గేమ్ లో తొలుత 10-6 ఆధిక్యంలోకి వెళ్ళిన ప్రణయ్ కు కొంచెం ప్రతిఘటన ఎదురైంది. ఈ దశలో వరుసగా పాయింట్లు సాధించిన లీ చోంగ్ 13-12 ముందంజలో నిలిచాడు.
అయితే ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా క్రమంగా పాయింట్లు సాధిస్తూ 17-14 తో భారత ప్లేయర్ ఆధిక్యంలోకి వెళ్ళాడు. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన లీ 17-17 తో మ్యాచ్ ను ఉత్కంఠ దిశగా నడిపించాడు. అయితే ఈ స్థితిలో రెచ్చిపోయిన ప్రణయ్ వరుసగా మూడు పాయింట్లు సాధించి మ్యాచ్ లో తన ఆధిక్యతను సాధించాడు.
లీ పట్టుదలగా పోరాడి ఓ మ్యాచ్ పాయింట్ ను కాచుకొన్నాడు. అయితే ఈ దశలో దూకుడుగా ఆడిన ప్రణయ్ గేమ్ తో పాటు మ్యాచ్ ను కైవసం చేసుకొన్నాడు. తాజా విజయంతో లీ తో ముఖాముఖిపోరును 1-2 తో ప్రణయ్ మెరుగుపర్చుకొన్నాడు.
మరో ప్రి క్వార్టర్స్ లో కిడాంబి శ్రీకాంత్ 21-15, 20-22, 21-16 తో జాన్ జోర్గెన్ సెన్ (డెన్మార్క్) పై పోరాడి విజయం సాధించాడు. 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో కీలకదశలో దూకుడుగా ఆడిన శ్రీకాంత్ గెలుపును కైవసం చేసుకొన్నాడు.
తొలిగేమ్ లో ఇరువురు ధాటిగా ఆడడంతో స్కోర్లు చాలాసార్లు సమానమయ్యాయి. 10-10 సమంగా ఉన్న దశలో వరుసగా పాయింట్లు సాధించిన శ్రీ, 16-12 తో ముందంజ వేశాడు. ఈ దశలో జోర్గెన్ సన్ పుంజుకొని 15-17 తో పోరాడాడు. అయితే ఈ దశలో భారత ప్లేయర్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్ ను కైవసం చేసుకొన్నాడు.
రెండోగేమ్ లోనూ ఇరువురు హోరాహరిగా పోరాడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. కీలకదశలో చెలరేగిన జోర్గెన్ సన్ ఆ గేమ్ ను నెగ్గాడు. మూడో గేమ్ ఆరంభంలో 0-5 తో వెనుకంజలో నిలిచిన శ్రీ క్రమంగా పాయింట్లు సాధించి 15-12 తో ముందంజ వేశాడు. ఈ దశంలో ఇదే దూకుడును కొనసాగించిన భారత ప్లేయర్ గేమ్ తో పాటు మ్యాచ్ ను కైవసం చేసుకొన్నాడు. క్వార్టర్ లో ప్రపంచ మాజీ నం.1 ఒలింపిక్ చాంపియన్ , ఎనిమిదో సీడ్ చెన్ లాంగ్ (చైనా) తో ప్రణయ్, ప్రపంచ 19వ, ర్యాంకర్ జూవీ వాంగ్ (చైనీస్) శ్రీకాంత్ తలపడనున్నాడు.