సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఘోర పరాజయం తర్వాత వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు వచ్చిన వార్తలను కెప్టెన్ ధోని ఖండించాడు. వచ్చే ఏడాది ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.
'నాకిప్పుడు 33 ఏళ్లు. ఇప్పటికీ పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. బహుశా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకుంటా. వచ్చే వన్డే ప్రపంచకప్లో ఆడుతానో లేదో చెబుతాన'ని మహేంద్ర సింగ్ ధోని చెప్పారు.
గత ఏడాది డిసెంబర్లో ఆస్టేలియా పర్యటనలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని, ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వన్డే కెరీర్ గురించి స్పష్టమైన ప్రకటన చేస్తానని ప్రకటించాడు. దీంతో గురువారం తన భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పాడు. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్లో ఓటమిపై ధోనీ చెప్పిన విషయాలు అతని మాటల్లోనే..
ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయిన తర్వాత కొద్దిగా ఆందోళన చెందా. పిచ్ మన స్పిన్నర్లకు సహకరించదని భావించా. కానీ, జడేజా, అశ్విన్ బాగా బౌలింగ్ చేశారు. రివర్స్ వచ్చే అవకాశమున్నా మన బౌలర్లు దాన్ని రాబట్టలేకపోయారు. ఆసీస్ చేసిన 328 పరుగులు మంచి స్కోరే అయినా ఛేదనలో మాపై ఒత్తిడి వచ్చిందన్నారు. ముందుగా మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాల్సింది. కానీ, పరుగులు చేయడం చాలా కష్టంగా మారిందని అన్నాడు.
ఇక విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై రాద్ధాతం చేయవద్దని కోరాడు. చిన్న విషయాన్ని భూతద్దంలోపెట్టి చూపొద్దు. అతను ఆడిన షాట్ బాగాలేదనే విషయాన్ని ఒప్పుకోవాలి. ఇలాంటి పొరపాట్లు ప్రతి ఒక్క ఆటగాడు చేస్తాడని అన్నాడు. 300 పరుగుల లక్ష్యాన్ని ముందించిన ప్రత్యర్థి బౌలింగ్ బాగుంటే ఒకనొక దశలో మనం రిస్క్ చేయాల్సి వస్తుందన్నారు. కానీ, కోహ్లీ ఆడిన షాట్ వర్కవుట్ కాలేదని ధోని తెలిపారు.
భారత క్రికెట్ చరిత్రలో ఐసీసీకి చెందిన వరల్డ్ టీ20, వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోపీలను సాధించిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియే.