రాంచీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పైన భారత్ ఘోర పరాజయం నేపథ్యంలో జార్ఖండ్ పోలీసులు భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓటమి నేపథ్యంలో అభిమానులు ధోనీ నివాసం వద్ద నిరసనకు దిగడం లేదా అనుచిత కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు భద్రతను పెంచారు.
విరాట్ కోహ్లీ అవుటైన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీ ప్రదర్శన పేలవంగా ఉండటానికి బాలీవుడ్ నటి అనుష్క శర్మయే కారణమని ఆరోపిస్తూ విమర్శలు చేస్తున్నారు.
నటుడు కమాల్ ఆర్ ఖాన్ అయితే మరింతగా జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అనుష్క శర్మ ఇంటిపైన రాళ్లు విసరండి... తన సినిమాలను బహిష్కరించండి. ఇండియా మ్యాచ్ గెలవకపోవటానికి కారణం అనుష్క శర్మే. ఆమె సినిమాలను ఎవరైతే చూస్తారో వారు దేశ ద్రోహులు అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 95 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 328 పరుగులు చేస్తే, భారత్ 46.5 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు పైన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, అభిమానులు.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోకులు కూడా పేల్చుతున్నారు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ సమయంలో కోహ్లీతో ధోనీ మాట్లాడుతూ.. శర్మతో ఎక్కువ టైం ఉండేలా చూసుకోవాలని చెప్పాడని, కానీ కోహ్లీ ధోనీ వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నాడని, ధోనీ రోహిత్ శర్మతో అని చెబితే, అనుష్క శర్మతో అనుకొని తొందరగా అవుటయ్యాడని సెటైర్లు వేస్తున్నారు. అనుష్క గాలరీలో ఉండే కోహ్లీ క్రీజులో ఎలా ఉంటాడని ఎద్దేవా సామాజిక అనుసంధాన వేదికల్లో సెటైర్లు వేస్తున్నారు.