ముంబై: భారత్ - పాకిస్తాన్ సిరీస్ పైన మాజీ క్రికెటర్, రాహుల్ ద్రావిడ్ గురువారం స్పందించారు. ఈ సిరీస్కు అతను మద్దతు తెలిపారు. క్రికెట్ కోణం నుండి చూస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానించవచ్చునని చెప్పారు. అయితే, మిగతా విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
క్రికెట్ కోణం నుండి చూస్తే భారత్ - పాకిస్తాన్ సిరీస్ ఎప్పుడైనా ఆహ్వానించదగ్గదే అన్నారు. కానీ ఈ సిరీస్ క్రికెట్ కంటే ఎక్కువ అన్నారు. భద్రత కోణంలో, రాజకీయ కోణంలో ఇలా పలు కోణాల్లోను చూడాలన్నారు.
కాగా, పాకిస్తాన్తో క్రికెట్ సిరీస్కు కేంద్రం అంగీకరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. స్థానిక మీడియా కథనాల ప్రకారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యాన్ ఖాన్ కలిసి చర్చించిన అనంతరం ఈ సిరీస్కు సానుకూల వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది.
అనంతరం పాకిస్తాన్తో క్రికెట్ సిరీస్ను పునురుద్ధరించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్రం చెప్పిందని తెలుస్తోంది. షహర్యార్ చర్చలు విజయవంతమయ్యాయని స్థానిక మీడియా ప్రకటించింది.
పాక్తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందనే వార్త విన్న తాను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పాడు. ఆ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నాడు. ఏ క్షణంలోనైనా కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నాడు.