మిర్పూర్: ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్లో శ్రీలంక జట్టుపై గెలిచిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మ్యాచులో అన్మోల్ ప్రీత్ సింగ్(72), సర్ఫరాజ్ ఖాన్(59)లు లంకను 97 పరుగుల తేడాతో ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఐదోసారి భారత్ ప్రపంచ కప్ ఫైనల్లో చేరిన జట్టుగా రికార్డు కెక్కింది.
2000, 2008, 2012లలో భారత్ అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలను దక్కించుకుంది. మంగళవారం బంగ్లాదేశ్లోని షేర్ ఈ బంగ్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాహుల్ ద్రావిడ్ కోచ్గా భారత జట్టు బ్యాటింగ్ చేసింది.
నిర్ణీత 50ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. అన్మోల్, సర్ఫరాజ్ ఖాన్లు అర్ధ శతకాలు చేసి భారత్కు మంచి స్కోరు అందించారు. అన్మోల్ ప్రీత్ 92 బంతుల్లో 72(6 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 71 బంతుల్లో 59(6ఫోర్లు, 1 సిక్స్) పరుగులు సాధించాడు.
సర్ఫరాజ్ ఈ టోర్నీలో మొత్తం 4 అర్ధ శతకాలు సాధించాడు. 5 ఇన్నింగ్స్ల్లో 304 పరుగులు చేసి 76సగటును సాధించాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 43 పరుగులతో రాణించాడు.
కాగా, అనంతరం లక్ష్యఛేదనలో 170 పరుగులకే ఆలౌట్ అయి పరాజయం పాలైంది. దీంతో ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్ మ్యాచులో భారత్.. బంగ్లాదేశ్ జట్టును లేదా వెస్టిండీస్ జట్టును ఎదుర్కొనే అవకాశం ఉంది. కాగా, సెమీ ఫైనల్లో అద్భుతంగా రాణించిన అన్మోల్ ప్రీత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోర్లు సంక్షిప్తంగా:
భారత్ అండర్-19: 50ఓవర్లలో 267/9(అన్మోల్ ప్రీత్ సింగ్ 72, సర్ఫరాజ్ ఖాన్ 59, వాషింగ్టన్ సుందర్ 43, అర్మాన్ జాఫర్ 29, అసితా ఫెర్నాండో 4/43, లహిరు కుమారా 2/50, తిలాన్ నిమేష్ 2/50).
ఓటమి పాలైన శ్రీలంక 42.4 ఓవర్లకు 170 పరుగులు చేసి ఆలౌటైంది(కమిండు మెండిస్ 39, షమ్ము అషాన్ 28, విషద్ రందిక 28, మయాంక్ దగర్ 3/21, ఆవేశ్ ఖాన్ 2/41).