న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ మైదానంలో రియో పరుగును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులు ఈ పరుగులో పాల్గొన్నారు. ధ్యాన్చంద్ జాతీయ మైదానం నుంచి నెహ్రూ మైదానం వరకు పరుగు కొనసాగింది.
ఈ సందర్భంగా భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 119 మంది క్రీడాకారుల బృందాన్ని రియో ఒలింపిక్స్కు పంపిస్తున్నామని చెప్పారు. వచ్చే ఒలింపిక్స్కు మరింత పెద్ద బృందాన్ని పంపుతామన్నారు.
2020 ఒలింపిక్స్ క్రీడల్లో ప్రతి జిల్లా నుంచి ఒక అథ్లెట్ ప్రాతినిధ్యం వహించాలన్నారు. భారత క్రీడాకారులు ప్రపంచ ప్రజల మనస్సులు గెలుచుకుంటారన్నారు. అలాగే, రియోలో ప్రారంభమయ్యే ఒలింపిక్స్లో భారత ఆటగాళ్లకు ఇష్టమైన భారతీయ వంటకాలు సిద్ధం చేయబడ్డాయన్నారు.
సరైన ఆహారం లభించదన్న ఆందోళన అవసరం లేదన్నారు. ఆటగాళ్లు తమకు ఇష్టమైన పదార్ధాలు తినవచ్చని, ఆపై కష్టపడి పతకాలు సాధించాలన్నారు. గతంలో ఆటగాళ్ల కన్నా వారితో వెళ్లిన అధికారులకు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించారని, తమ ప్రభుత్వం అందరినీ సమానంగానే చూస్తుందన్నారు.
అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు తగు సమయం ఇవ్వాలనే ఆటగాళ్లను ముందుగానే పంపామన్నారు. ఇప్పటికే ఎంతోమంది రియోకు చేరుకున్నారన్నారు. 119 మంది ఆటగాళ్ల కోసం కేంద్రం రూ. 124 కోట్లను ఖర్చు పెడుతోందన్నారు. ప్రతి అథ్లెట్ తన శక్తి మేరకు రాణించి, ప్రపంచ క్రీడా సంగ్రామంలో భారత ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.