పెర్త్: ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో దుమ్మురేపుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం జరిగిన నెట్ ప్రాక్టీ్సలో గాయపడ్డాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ సందర్భంగా బౌలర్ విసిరిన బంతి అనూహ్యంగా మహీ ఎడమ మోచేతికి బలంగా తాకింది. తర్వాత ధోనీ పెద్ద ఐస్ ప్యాక్ను చేతికి కట్టుకుని ఉపశమనం పొందాడు.
ఈ నేపథ్యంలో యూఏఈతో మ్యాచ్లో ధోనీ బరిలోకి దిగేది అనుమానంగా మారింది. అయితే మహీ పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని భారత మీడియా మేనేజర్ ఆర్ఎన్ బాబా తెలిపాడు. ఒక వేళ ధోనీ మ్యాచ్కు దూరమైతే కోహ్లీ పగ్గాలు చేపట్టనున్నాడు. ఇక కీపర్గా రాయుడును ఆడించే చాన్స్ ఉంది.
ప్రపంచ కప్ పోటీలకు రిజర్వ్ కీపర్ను ఎంపిక చేయలేదు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో శనివారం జరిగే మ్యాచులో మహీ స్థానంలో రాయుడు కీపింగ్ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోది. బౌలర్ మొహమ్మద్ షమీ గాయం కారణంగా శనివారంనాటి మ్యాచుకు దూరమైన విషయం తెలిసిందే.
ధోనీ టాస్ వేసే సమయంలో మైదానంలోకి దిగితే తప్ప అతను ఆడుతాడనే గ్యారంటీ లేదని అంటున్నారు. కాగా, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ అర్షద్ అయూబ్ మార్చి 2వతేదీన చెన్నైలో జరిగే బిసిసిఐ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి భారత్ తెరిగి వెళ్తున్నాడు. అయూబ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఎ) అధ్యక్షుడిగా ఉన్నారు. మార్చి 6వతేదీన వెస్టిండీస్తో జరిగే మ్యాచుకల్లా ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది.