కోల్కతా: ఐపిఎల్ 8వ సీజన్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ముంబై ఇండియన్స్ విజయ కేతనం ఎగురేశారు. ఈ ఏడాది ఐపియల్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తయింది. 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి గురై చెన్నై బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు.
టాస్ గెలిచి ముంబైని బ్యాటింగ్కు దించిన ధోనీ వ్యూహం బెడిసి కొట్టింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేశారు. దీంతో 41 పరుగుల భారీ తేడాతో ముంబై చేతిలో చెన్నై ఓటమి చవి చూసింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మోహిత్ శర్మ చివరలో సిక్సర్లతో అలరించాడు. కేవలం 7 బంతుల్లో 21 పరుగులు చేశాడు. కాగా, ముంబై బౌలర్లలో మెక్క్లెగాన్ మూడు వికెట్లు తీసుకోగా, హర్భజన్ సింగ్, మలింగ రెండేసి వికెట్లు తీసుకున్నారు. వినయ్ కుమార్కు ఒక్క వికెట్ లభించింది.
అంతకు ముందు ముంబై తన ముందు ఉంచిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 22 పరుగుల వద్ద తొలి వికెట్ను జారవిడుచుకుంది. మైకెల్ హస్సీ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. డ్వైన్ స్మిత్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. హర్భజన్ సింగ్ బౌలింగులో 48 బంతుల్లో 57 పరుగులు చేసిన స్మిత్ అవుటయ్యాడు. దాంతో చెన్నై 88 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
చెన్నై 108 పరుగుల వద్ద నాలుగో వికెట్ను జారవిడుచుకుంది. పరుగులు చేయాల్సిన ఒత్తిడిలో బ్రేవ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెక్క్లాగన్ బౌలింగ్లో అవుటయ్యాడు. ధోనీ కూడా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. పరుగుల వేటను కొనసాగించలేక మలింగ బౌలింగులో అతను 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో 124 పరుగుల వద్ద చెన్నై ఐదో వికెట్ కోల్పోయింది.
చెన్నై 134 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. మలింగ బౌలింగులో పవన్ నేగీ కేవలం 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చెన్నై 137 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.
వినయ్ కుమార్ బౌలింగులో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ పట్టి డూ ప్లెసిస్ను అవుట్ చేశాడు. దాంతో చెన్నై 126 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
హర్భజన్ సింగ్ సురేష్ రైనాను చాలా తెలివిగా అవుట్ చేశాడు. హర్భజన్ వేసిన బంతిని రైనా ముందుకు వచ్చి ఆడబోయాడు. అయితే, బంతి మిస్సయి వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చేతిలోకి వెళ్లింది. పార్థివ్ ఏ మాత్రం పొరపాటు చేయకుండా స్టంప్స్ను తొలగించాడు. దాంతో సురేష్ రైనా 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దాంతో చెన్నై 99 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఐపిఎల్ 8 సీజన్ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. అంబటి రాయుడి 24 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. హర్భజన్ సింగ్ మూడు బంతుల్లో ఆరు పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో బ్రేవోకు రెండు వికెట్లు లభించగా, మోహిత్ శర్మ, స్మిత్ తలో వికెట్ తీసుకున్నారు. పార్థివ్ పటేల్ ఒక్క పరుగు వద్దనే అవుటైనప్పటికీ తర్వాత సిమన్స్, రోహిత్ శర్మ దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత రాయుడు, పోలార్డ్ కూడా అదే జోరును సాగించారు.
చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్ మ్యాచులో ముంబై ఇండియన్స్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఒక్క పరుగుకే ఒక్క వికెట్ కోల్పోయింది. పార్థివ్ పటేల్ రన్నవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. బ్రేవో వేసిన బంతిని భారీ షాట్ కొట్టడానికి అంబటి రాయుడు ప్రయత్నించాడు. అయితే, అది బౌండరీ లోపలే ఫీల్డర్ స్మిత్ చెంతుకు చేరింది. స్మిత్ దాన్ని జారవిడిచాడు. దాంతో రాయుడికి లైఫ్ లభించింది. 191 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. పోలార్డ్ 18 బంతుల్లో 36 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు.
హార్దిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ 191 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. పార్థివ్ పటేల్ అవుటైన తర్వాత రోహిత్ శర్మ, సిమన్స్ చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశారు. ఆరు ఓవర్లలో 61 పరుగులు చేశారు. మోహిత్ శర్మ వేసిన బంతిని సిమన్స్ గాలిలోకి లేపాడు. క్యాచ్ మిస్సయింది. కష్టమైన క్యాచే అయినా లైఫ్ దొరకడంతో పాటు సిమన్స్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 35 బంతుల్లో అతను 50 పరుగులు చేశాడు.
10.1 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 102 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 26 బంతుల్లో అర్థ సెంచరీ చేసి, బ్రేవో బౌలింగులో అవుటయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ 12 ఓవర్లలో 120 పరుగులు చేసి రెండో వికెట్ కోల్పోయింది. వెంటనే 120 పరుగుల వద్దనే ముంబై మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ వచ్చిన సిమన్స్ 45 బంతుల్లో 68 పరుగులు చేసి స్మిత్ బౌలింగ్లో పెవిలియన్ చేరుకున్నాడు.
ఐపియల్ 8 సీజన్ ఫైనల్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆదివారంనాడు టాస్ గెలిచి ముంబై ఇండియన్స్పై బౌలింగు ఎంచుకున్నాడు. ఐపిఎల్ ట్రోఫీని మూడు సార్లు గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించాలని ధోనీ సేన ఉవ్విళ్లూరింది. అయితే, ఆశలు నీరు గారాయి.
చెన్నై ఐపిఎల్ ట్రోఫీని 2010లోనూ 2011లోనూ గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ 2013లో ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకుంది. తుది జట్లలో రెండు కూడా ఏ విధమైన మార్పులు చేయలేదు.
చెన్నై సూపర్ కింగ్స్: డ్వైన్ స్మిత్, మైకెల్ హస్సీ, సురేష్ రైనా, ఫాఫ్ డూ ప్లెసిస్, డ్వైన్ బ్రేవో, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవిచంద్ర జడేజా, పవన్ నేగీ, ఆశిష్ నెహ్రా, ఆర్ అశ్విన్, మోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్: లెండిల్ సిమన్స్, పార్థివ్ పటేల్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, కీరోన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, హర్భజన్ సింగ్, జె సుచిత్, మిచెల్ మెక్క్లెనఘాన్, ఆర్ వినయ్ కుమార్, లసిత్ మలింగ