న్యూఢిల్లీ: కోల్కతా నైట్రైడర్స్ మరోసారి తన సత్తా చాటింది. కెప్టెన్ గౌతం గంభీర్ తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్పై కోల్కతా సునాయసంగా విజయం సాధించింది. గంభీర్ (49 బంతుల్లో 8 ఫోర్లతో 60) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి కోల్కతాకు ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించి పెట్టాడు.
సోమవారమిక్కడ జరిగిన మ్యాచ్లో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. మనోజ్ తివారి (32) టాప్ స్కోరర్. ఉమేష్, మోర్కెల్, చావ్లా తలో రెండు వికెట్లు తీశారు. చివరి ఓవరులో ఉమేష్ యాదవ్ కట్టడి చేయడం కోల్కతా నైట్ రైడర్స్కు కలిసి వచ్చింది.
147 పరుగుల లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్కు దిగిన కోల్కతా 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. గంభీర్తో పాటు యూసుఫ్ పఠాన్ (40 నాటౌట్) కూడా రాణించాడు. ఉమేష్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.
తొలుత కోల్కతా ఇబ్బందులకు గురైంది. ఐదో ఓవర్లో ఊతప్ప (13), మనీష్ పాండే (0)ను అవుట్ చేసి ముత్తుస్వామి నైట్రైడర్స్కు షాకిచ్చాడు. ఈ దశలో కెప్టెన్ గంభీర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మాథ్యూస్ వేసిన ఆరో ఓవర్లో గంభీర్ రెండు ఫోర్లతో జోరు ప్రదర్శించాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ (24) కూడా దూకుడుగా ఆడాడు.
అయితే అతడ్ని కల్టర్ నీలే వెనక్కి పంపాడు. తర్వాత గంభీర్తో యూసుఫ్ జతకట్టాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో విజయం తేలికైంది. చివర్లో గంభీర్ అవుటైనా యూసుఫ్ పఠాన్ డష్కాటేతో కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
అంతకుముందు కోల్కతా టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించింది. కోల్కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ బ్యాటింగ్ తడబడుతూ సాగింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1)ను మోర్కెల్ బలితీసుకున్నాడు. స్వల్ప తేడాతో కెప్టెన్ డుమినీ (5)ని స్పిన్నర్ నరైన్ అవుట్ చేశాడు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్-మనోజ్ తివారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే జోరుమీదున్న శ్రేయాస్ (31)ను చావ్లా వెనక్కి పంపాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ (21) మరోసారి స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాడు. చివర్లో మాథ్యూస్ (28) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. అయితే చివరి ఓవరులో పరుగులు రాబట్టడంలో ఢిల్లీ విఫలమైంది.