అహ్మదాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్కు మరో ఊరట లభించింది. కోహ్లీ సేన రెండో మ్యాచులో విజయం సాధించింది. బౌలింగ్లో స్టార్క్, బ్యాటింగ్లో కోహ్లీ చెలరేగడంతో బెంగళూరు 9 వికెట్ల తేడాతో రాజస్థాన్పై ఘన విజయం సాధించింది. శుక్రవారమిక్కడ జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.
అనంతరం కోహ్లీ (46 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 62 నాటౌట్), డివిల్లీర్స్ (34 బంతుల్లో 6 ఫోర్లతో 47 నాటౌట్) రాణించడంతో బెంగళూరు 16.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టార్క్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.
లక్ష్యం స్వల్పం కావడంతో బెంగళూరు అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్ గేల్ 2 ఫోర్లు, సిక్స్తో చెలరేగుతున్నట్లు అనిపించినప్పటికీ వాట్సన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అతను 20 పరుగులు చేశాడు. ఆ తర్వాత కోహ్లీ, డివిల్లీర్స్ ఆడుతూ పాడుతూ అన్నట్లుగా బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో కోహ్లీ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 17వ ఓవర్లో డివిల్లీర్స్ బౌండ్రీతో విన్నింగ్ షాట్ కొట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 98 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటింగ్ నీరు గారింది. మెరుపు ఆరంభాన్ని రాజస్థాన్ సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఓపెనర్లు వాట్సన్, రహానె భారీ షాట్లతో ఊపుమీద కన్పించారు. అయితే ఐదో ఓవర్లో యువ పేసర్ హర్షల్కు రహానె (18) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. తర్వాతి ఓవర్లో వాట్సన్ (26) క్యాచ్ అవుటయ్యాడు. రాజస్థాన్ 46 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది.
అనంతరం బెంగళూరు బౌలర్ల దెబ్బకు దీపక్ హుడా (1), శాంసన్ (4) సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. ఓ వైపు వికెట్లు పడుతున్న స్టీవెన్ స్మిత్ సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. అయితే బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్కు పరుగులు రావడం కష్టమైంది.
స్టార్క్ వేసిన 18వ ఓవర్లో కీపర్ దినేష్ కార్తీక్ డైవ్కొట్టి అద్భుత క్యాచ్ పట్టడంతో స్మిత్ (31) వెనుదిరిగాడు. అదే ఓవర్లో బిన్నీ (20) అవుటయ్యాడు. చివర్లో ఫాల్క్నర్ (4), కులకర్ణి (1) నిరాశపర్చారు. రాజస్థాన్ 55 పరుగుల తేడాతో చివరి 7 వికెట్లు కోల్పోయింది.