కోల్కతా: ఐపీఎల్ 8 ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు పాయింట్ల రేసులో దాదాపు సమానంగా నిలుస్తున్నాయి. నిన్న సొంత గడ్డ పైన చెలరేగిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఇప్పుడు కోల్కతాలో నైట్ రైడర్స్ పైన 35 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 132 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి, ఓడిపోయింది. హైదాబాద్ జట్టులో హెన్రిక్స్ 33 బంతుల్లో 41, కరణ్ శర్మ 20 బంతుల్లో 32 పరుగులు చేశారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉమేష్ యాదవ్కు దక్కింది. అతను రెండు వికెట్లు తీసి 34 పరుగులు ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టులో ఎవరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. అయినప్పటికీ 167 పరుగులు చేసింది. అందరు కలిసి పోరాడారు.
ఊతప్ప 27 బంతుల్లో 30 పరుగులు, గంభీర్ 23 బంతుల్లో 31 పరుగులు, మనీష్ పాండే 26 బంతుల్లో 33 పరుగులు, యూసుఫ్ పఠాన్ 19 బంతుల్లో 30 పరుగులు చేశారు. ఆ తర్వాత 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ ఏ దశలోను లక్ష్యం దిశగా సాగలేదు.
55 పరుగులకే ఎనిమిది ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. వార్నర్ అవుట్ కావడం హైదరాబాదుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఓజా, ధావన్, మోర్గాన్లు కూడా విఫలమయ్యారు. ఓ దశలో హైదరాబాద్ స్కోర్ 81 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో కరణ్ శర్మ 18 ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో స్కోర్ కాస్త పెరిగింది.