కోల్కతా: మ్యాచ్ మధ్యలో తన ప్రేయసి అనుష్క శర్మతో ముచ్చట పెట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు కెప్టెన్ చిక్కుల్లో పడిన సంఘటన ప్రభావం ఆదివారం కోల్కతా ఈడెన్ గార్డెన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లపై పెద్దగానే పడినట్లు ఉంది. ఆ సంఘటన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు కనిపించారు.
ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ ఐపియల్ ట్రోఫీని రెండోసారి గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈడెన్ గార్డెన్ ఒకటో గేట్ వద్ద రెండు బస్సులు ఆగి ఉన్నాయి. ఒకటి 20 సీట్ల చిన్న బస్సు. దీన్ని ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు, మీడియా మేనేజర్స్కు, తదితరులకు కేటాయించారు. మరోటి ఆటగాళ్ల కోసం కేటాయించారు.
రెండు బస్సులు కూడా ఎదరెదురుగా ఆగి ఉన్నాయి. అయితే, ఈ రెండు బస్సుల్లో ప్రజలను ఎక్కువగా ఆకర్షించింది చిన్న బస్సే. ఆటగాళ్లు తమ జీవిత భాగస్వాములను కలిసి ఆనందం వ్యక్తం చేసినప్పటికీ అతిగా ప్రవర్తించలేదు. ఆటగాళ్లు చాలా క్రమశిక్షణతో కనిపించారు.
టీమ్ బస్సులో సచిన్ టెండూల్కర్ తలపాగాతో ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. దాన్ని ఎవరో సంబరాల సమయంలో ఆయన తలపై పెట్టి ఉంటారు. దాన్ని ఆయన తీసేయలేదు. సచిన్ భార్య అంజలి, ఆయన కూతురు సారా మినీ బస్సులో ఉన్నారు. రోహిత్ శర్మ ప్రేయసి రీతిక కూడా అదే బస్సులో ఉంది. మహిళలు ముచ్చెట్లలో మునిగిపోయినట్లు కనిపించారు.
హర్భజన్ సింగ్ ఒక్కడే ముంబై ఇండియన్స్ జెండాతో వచ్చాడు. ప్రతిస్పందనల కోసం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మినీ బస్సు వద్దకు చేరుకున్నారు. కానీ అందులోనివారెవరూ కనీసం వారిని పట్టించుకున్నట్లు కనిపించలేదు. అయితే, సచిన్ కూతురు, సచిన్ కూతురు అనే కేకలు చాలా సేపు వినిపించాయి.