ముంబై: ఐపీఎల్ 8లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పనైపోయినట్లే! ఆదివారం నాడు ముంబై ఇండియన్స్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓడింది. తొలుత విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ సేన వరుసగా హ్యాట్రిక్ సాధించింది. ముగ్గురు కీలక ఆటగాళ్లు పరుగుల కోసమని రనౌట్ల రూపంలో పెవిలియన్కు చేరడంతో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులకు పరిమితమైంది.
ముంబై ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ఇంకా రేసులోనే ఉన్నానని నిరూపించుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయ 172 పరుగులు సాధించింది. ఓపెనర్లు లెండల్ సిమన్స్ (56 బంతుల్లో 71), పార్థీవ్ పటేల్ (36 బంతుల్లో 59 పరుగులు) తొలి వికెట్కు 111 పరుగులు జోడించారు.
కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 26 పరుగులు చేశాడు. చివరిలో కీరన్ పోలార్డ్ 7, అంబటి రాయుడు 4 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసింది.
తర్వాత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ను గెలిపించేందుకు డేవిడ్ మిల్లర్ (43) విఫలయత్నం చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్ (39) కూడా కొంత వరకూ ముంబై బౌలింగ్ను ఎదుర్కోగా మిగతా బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు.
కెప్టెన్ జార్జి బెయలీ (21), సాహా (12), అక్షర్ పటేల్ (0) రనౌట్లు పంజాబ్ ఓటమికి కారణమయ్యాయి. లసిత్ మలింగ మరోసారి మాయ చేశాడు. పంజాబ్ గెలుపునకు చివరి 24 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన తరుణంలో మిల్లర్ను అవుట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బతీశాడు. కాగా, పంజాబ్ జట్టుకు మద్దతుగా సన్నీ లియోన్, ప్రీతిజింతా వచ్చారు.