ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8 ఉత్కంఠగా సాగింది. లీగ్లో తొలుత వెనుకబడ్డ జట్టు టైటిల్ గెలుచుకుంది. అదే లీగ్లో తొలి హాఫ్లో దూసుకుపోయిన జట్లు, హాట్ ఫేవరేట్ అయిన జట్లు ఆరంభంలోనే ఇంటి దారి పట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో బోల్తా పడింది. టీ 20 అంటేనే బంతి బంతికి మార్పు కనిపిస్తుంది.
లీగ్లో ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఫెయిలైంది. లీగ్ నుండి ఇంటికు వెళ్తుందని అందరూ భావించారు. కానూ సగం పూర్తయ్యాక ముంబై రెచ్చిపోయింది. అనంతరం పాయింట్ల స్థానంలో చెన్నై తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఎవరూ ఊహించలేని విధంగా టైటిల్ గెలిచింది.
ముంబైలో స్టార్ ప్లేయర్లు ఉన్నా లీగ్ ఆరంభంలో చతికిల పడింది. కేవలం ఒక్కటే గెలిచింది. భారీ స్కోర్లు చేయడానికి కష్టపడింది. చేసినా కాపాడుకోలేకపోయింది. ఓ మ్యాచ్లోనైతే చెన్నై జట్టు ముంబైపై 184 పరుగుల లక్ష్యాన్ని సైతం దాదాపుగా మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
ఓపెనర్ల వైఫల్యం, మిడిల్లో నిలకడ లేకపోవడం, బౌలర్లు ధారాళంగా పరుగులివ్వడంతో ముంబయి ప్లేఆఫ్ రేసులో బాగా వెనుకబడిపోయింది. కానీ అనూహ్యంగా పుంజుకున్న ముంబై చివరి ఆరు మ్యాచ్ల్లో ఐదు గెలిచి ముందంజ వేసింది. ఏడో మ్యాచ్ నుంచి వరుసగా మూడు విజయాలు సాధించడం ముంబై ఛాంపియన్గా నిలవడంలో మలుపు.
ఫించ్ గాయంతో స్వదేశానికి వెళ్లిపోతే గానీ ఓపెనింగ్ చేసే అవకాశం దక్కని సిమన్స్ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అద్భుత ఆరంభాలతో ముంబై విజయాల్లో అత్యంత కీలకమయ్యాడు. ఫైనల్ సహా 13 మ్యాచ్ల్లో 45 సగటుతో 540 పరుగులు సాధించాడు.
టాప్లో సిమన్స్ చెలరేగితే మిడిల్లో రోహిత్ (482 పరుగులు), పొలార్డ్ (419 పరుగులు) మెరిశారు. అంబటి రాయుడు (281 పరుగులు) కూడా తీవ్ర ఒత్తిడిలో అమూల్యమైన ఇన్నింగ్స్లు ఆడి ముంబైని గట్టెక్కించాడు.
ఐపీఎల్ 8లో భజ్జీ ఆట వల్లనే అతను బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అవసరమైనప్పుడు బ్యాటుతోనూ జట్టును ఆదుకున్న అతడు బంతితో తిరుగులేని ప్రదర్శన చేశాడు. 15 మ్యాచ్ల్లో 7.82 ఎకానమీ రేట్తో 18 వికెట్లు పడగొట్టాడు. మలింగ, మెక్లెనగన్ల భాగస్వామ్యం అమూల్యం. హార్ధిక్ వంటి వారు కూడా రాణించారు. తమ సమష్టి కృషి వల్లనే ట్రోఫీ గెలిచామని సచిన్ టెండుల్కర్ అన్న విషయం తెలిసిందే.
బాగా ఆడుతాయనుకుంటే...
ఐపీఎల్ 8 ఫేవరేట్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా ఉంది. కానీ అది అనూహ్యంగా లీగ్లో చివరి స్థానంతో ఇంటి దారి పట్టింది. రూ.16 కోట్లకు అమ్ముడు పోయిన యువరాజ్ సింగ్ వంటి ఆటగాడిగా ఉన్న ఢిల్లీ కూడా ఆదిలోనే వెను తిరిగింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ రేసులో కనిపించింది. చివరి మూడు మ్యాచులు సొంత మైదానంలో ఆడే అవకాశం వచ్చింది. దీంతో హైదరాబాద్ కచ్చితంగా ప్లే ఆఫ్ చేరుకుంటుందని భావించారు. కానీ సొంత మైదానంలో కీలక సమయంలో బోల్తా పడింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ ఆరంభంలో దూకుడుగా ఆడింది. తొలి ఐదు మ్యాచులు గెలిచి, లీగ్లో అన్ని జట్ల కంటే తొలి స్థానంలో నిలిచేలా కనిపించింది.
కానీ ఆ తర్వాత దాని దూకుడు తగ్గింది. తొలి ఐదు మ్యాచుల్లో నెగ్గిన రాజస్థాన్.. ఆ తర్వాత తొమ్మిది మ్యాచుల్లో నెగ్గింది రెండే. రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. ట్రోఫీ ఫేవరేట్ చెన్నై సూపర్ ఈ ఐపీఎల్లో ముంబై చేతిలో మూడుసార్లు దెబ్బతింది. లీగ్లో ఓసారి, క్వాలిఫయర్ వన్, పైనల్లో ముంబై చేతిలో ఓడింది. ఐపీఎల్ 8 ప్లేఆఫ్కు చేరే జట్లపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ప్రపంచ కప్లో ధోనీ సేన బాగా రాణించింది. అయితే, సెమీస్లో ఇంటికి చేరింది. అలాగే, ఐపీఎల్లోను క్వాలిఫయర్ నుండి ముంబై చేతిలో ఓడిపోయింది.
ధోనీ, గంభీర్ల సరసన రోహిత్
ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ చెన్నై సారథి ధోనీ, కోల్కతా సారథి గంభీర్ల సరసన నిలిచాడు. ఈ ముగ్గురు తమ తమ జట్లకు రెండుసార్లు ట్రోఫీలు అందించారు.