న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ సమర్పించిన నివేదికపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్ధానం గురువారానికి వాయిదా వేసింది.
కాగా, విచారణ సందర్భంగా, నివేదికలో పేర్కొన్న ఆటగాళ్ల పేర్లతో సహా రిపోర్టులో ఉన్నదంతా బహిర్గతం చేయాలని క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బీహార్ తరపు న్యాయవాది హారీశ్ సాల్వే కోరారు. అంతే కాకుండా ఐసీసీ ఛీఫ్ ఎన్ శ్రీనివాసన్ను సెక్షన్ 6 కింద 2 నుంచి 6ఏళ్ల పాటు భారత్ క్రికెట్ నుంచి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
దీనికి సుప్రీం కోర్టు బెంచ్ "కమిటీ నివేదికలో ఉన్నది బయటపెట్టడం ద్వారా మీకు ప్రయోజనం కలగొచ్చు లేదా నష్టం వాటిల్లవచ్చు. ఆటలో గెలుపోటముల కంటే సమాచారాన్ని బయటపెట్టడం క్షమించరాని నేరం" అని అన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈరోజు నివేదికపై జరిగిన విచారణలో శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్ల్లో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మయేప్పన్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్లకు పాల్పడ్డట్టు ముద్గల్ కమిటీ నివేదికలో పేర్కొంది.
ఇక సోమవారం బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగిన పదవుల్లా ఎలా ఉంటారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. బీసీసీఐ, ఐపీఎల్ వేరు కాదు. బీసీసీఐ సృష్టించిన కమిటీనే ఐపీఎల్. ఈ రెండింట్లో ఒకే వ్యక్తి రెండు పదవుల్లో ఎలా ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడు క్రికెట్ను సజావుగా నడిపించాలని పేర్కొంది.
అతడికే ప్రాంఛైజీ ఉంటే ఖచ్చితంగా అనుమానాలొస్తాయి. ప్రాంచైజీల పై నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు... తనకూ ఓ ప్రాంజైజీ ఉన్న అధ్యక్షుడు మౌనంగా ఉంటాడా? ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవాడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొన్న విషయం తెలిసిందే.
క్రికెట్కు ప్రజాదరణతోనే గుర్తింపు లభిస్తుందని, శ్రీనివాసన్ లాంటి వ్యక్తుల వల్ల కాదన్న కోర్టు, సంశయ లాభం వ్యక్తలకు చెందకూడదని చెప్పింది. ముద్గల్ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. శ్రీనివాసన్ అధ్యక్ష పదవిపై పోటీపడడంపై ఎలాంటి తీర్పు నివ్వకుండా వాయిదా వేసింది.