న్యూఢిల్లీ: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కటి కాబోతున్నారా? అంటే కావొచ్చుననే ప్రచారం బాలీవుడ్ టౌన్లో జోరందుకుంది. అనుష్క, కోహ్లీలు త్వరలో తమ ఎంగేజ్మెంట్ పైన ప్రకటన చేయవచ్చుననే ఊహాగానాలు గుప్పుమంటున్నాయి.
కొద్ది రోజుల క్రితం కోహ్లీ, అనుష్క శర్మ కుటుంబ సభ్యులు కలుసుకున్నారంటున్నారు. సబర్బన్ ముంబైలోని అనుష్క శర్మ ఇంటి పెంట్ హౌస్లో రెండు కుటుంబాలు కలుసుకున్నాయని ప్రచారం సాగుతోంది. ఇరు కుటుంబాల సభ్యులు కలుసుకున్నాయనే వార్తల నేపథ్యంలో ఊహాగానాలు జోరందుకున్నాయి.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ మధ్య ఉన్న సంబంధాన్ని బహిరంగంగా కొట్టి పారేస్తున్నప్పటికీ, వారి కుటుంబ సభ్యులకు మాత్రం వారిద్దరు ఒక్కటి కావాలనుకుంటున్నారనే విషయం తెలుసుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా, కోహ్లీ, అనుష్కలు ఎంగేజ్మెంట్కు ప్రస్తుతానికి తొందర పడటం లేదంటున్నారు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ రానున్న ఆస్ర్టేలియా సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. అలాగే, శ్రీలంక సిరీస్లో కూడా కోహ్లీ మూడు వన్డేలకు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అనుష్క శర్మ నటిస్తున్న పీకే సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే, ఎంగేజ్మెంట్.. కేవలం ఊహాగానాలే తప్ప అలాంటిదేం ఉండదనే వారు లేకపోలేదు.
కాగా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మధ్య ఏదో ఉందనే గుసగుసలు చాలా రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అనుష్క ఎక్కడ ఉండే కోహ్లీ అక్కడ, విరాట్ ఎక్కడ ఉండే అనుష్క శర్మ అక్కడ వాలుతారనే ప్రచారం ఉంది. కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికా టూర్కు కోహ్లీ.. అనుష్క శర్మను కూడా తీసుకు వెళ్లాడు.
ఇటీవల కోహ్లీ తాజాగా ఓ యాడ్లో నటించాడు. అందులో అనుష్క శర్మ నటించడం లేదు. అయినప్పటికీ, ఈ యాడ్లో కోహ్లీ బాగా కనిపించాలని తాపత్రయపడింది. కోహ్లీ బాగా కనిపించాలని అనుష్క విరాట్ కోహ్లీ, అతని హెయిర్ అండ్ మేకప్ టీమ్ను కలిసి సూచనలు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అతను ఫర్ఫెక్ట్ లుక్ కోసం ఆమె వారితో డిస్కస్ చేశారని అంటున్నారు.
ఈ యాడ్ షూటింగుకు కొద్ది రోజుల క్రితం కోహ్లీ, అనుష్కలు ఓ సెలూన్కు వెళ్లారని, అక్కడ కోహ్లీ హెయిర్ కటింగ్ చేయించుకున్నారనే వాదనలు వినిపించాయి. అంతకుముందు అనుష్క శర్మ ఓ సినిమా షూటింగులో ఇరవై టేకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.