కొలంబో: శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ ఇషాంత్ శర్మ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచులో 8 వికెట్లు పడగొట్టిన శర్మ.. భారత్ నుంచి 200ల వికెట్లు తీసిన నాలుగో పేసర్ రికార్డు నమోదు చేశాడు.
మంగళవారం కొలంబోలో శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచులో శ్రీలంక కెప్టెన్ ఏంజిలో మ్యాథ్యూస్(110) వికెట్ తీయడం ద్వారా 200ల టెస్ట్ వికెట్లు తీసిన క్లబ్లో ఇషాంత్ శర్మ చేరాడు.
కాగా, 117 పరుగుల తేడాతో మూడో టెస్టులో గెలుపొంది. భారత్... 22ఏళ్ల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సిరీస్ విజయం సాధించింది.
గతంలో 200ల వికెట్లు తీసిన పేస్ బౌలర్లలో కపిల్ దేవ్, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ ఉన్నారు. కాగా, ఇప్పుడు ఈ క్లబ్లో పేసర్ ఇషాంత్ శర్మ చేరాడు.
మొత్తంగా చూసుకున్నట్లయితే భారత్ తరపున అంతర్జాతీయంగా ఎక్కువ వికెట్లు తీసిన 8వ ఆటగాడిగా జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
26ఏళ్ల ఇషాంత్ శర్మ 2007లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 65 మ్యాచులు ఆడాడు.
భారత్ తరపున టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు:
1. అనీల్ కుంబ్లే -619 వికెట్లు(132 మ్యాచులు)
2. కపిల్ దేవ్-434 (131మ్యాచులు)
3. హర్భజన్ సింగ్-417(103)
4. జహీర్ ఖాన్-311(92)
5, బిషన్ సింగ్ బేడీ-266(67)
6. భగవత్ చంద్రశేఖర్-242(58)
7. జవగళ్ శ్రీనాథ్-236(67)
8. ఇషాంత్ శర్మ-200(65)
9. ఎరపల్లి ప్రసన్న-189(49మ్యాచులు)