గౌహతి: ఈశాన్య రాష్ట్రాలకు ద్వారం వంటిది అసోం. ఆ రాష్ట్ర రాజధాని గౌహతి సమున్నత సంరంభానికి వైదికైంది. దేశ వ్యాప్తంగా ఫుట్బాల్ పట్ల ప్రజల్లో చైతన్యం, ప్రేరణ రగిలించేందుకు ఏర్పాటుచేసిన ఇండియన్ సూపర్లీగ్ (ఐఎస్ఎల్) మూడో సీజన్ ప్రారంభ వేడులు ఈ రోజు సాయంత్రం ప్రారంభం కానున్నాయి.
ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బాలీవుడ్ తారలు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, లీగ్ క్లబ్ల యజమానులతో కార్నివాల్ వాతావరణం నెలకొంది. మరోవైపు సాంస్కృతిక వైవిధ్యానికి మారుపేరుగా దేశమంతా ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎనిమిది జట్లతో ఏర్పాటైన ఐఎస్ఎల్ లీగ్ మ్యాచ్ నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి, కేరళ బ్లాక్ బస్టర్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానున్నది.
ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి, వారందరి కోసం సుదీర్ఘ కాలం పనిచేసే వేదిక ఐఎస్ఎల్ ప్రారంభ వేడుకలను ఈ దఫా నిర్వహణకు నార్త్ఈస్ట్ వేదికైంది. భారత్లో ఫుట్బాల్ ప్రీమియర్ టోర్నమెంట్గా గుర్తింపు పొందిన ఐఎస్ఎల్, గత రెండు సంవత్సరాలుగా ఉన్నతస్థాయి క్రీడాకారులతో ఒప్పందాలకు, ప్రతిభావంతులైన నూతన క్రీడాకారులకు వేదికగా మారింది.
గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో బాలీవుడ్ నటీమణులు, టీవీ ఆర్టిస్టులు, ఇతర కళాకారుల ఆధ్వర్యంలో ఐఎస్ఎల్ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రసిద్ధి చెందిన షిల్లాంగ్ చాంబర్ కొయిర్ ఆధ్వర్యంలో స్థానిక కళాకారులు అతిథులను అలరింపజేయనున్నారు.
బాలీవుడ్ హార్ట్రోబ్స్గా పేరొందిన అలియాభట్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ధావన్ సహా 500 మంది కళాకారులు 30 నిమిషాల సేపు గౌహతికి విచ్చేసిన సినీ, క్రికెట్, కార్పొరేట్, ఫుట్బాల్, రాజకీయ, రాజకీయేతర ప్రముఖులను తమ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అలరించనున్నారు. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి క్లబ్ యజమాని జాన్ అబ్రహం, ఐఎస్ఎల్ వ్యవస్థాపకురాలు - చైర్పర్సన్ నీతా అంబానీ శుక్రవారమే గౌహతికి చేరుకున్నారు.
ముంబై సిటీ ఎఫ్సి సహ యజమాని రణబీర్ కపూర్, కేరళ బ్లాక్ బస్టర్స్ సహా యజమాని సచిన్ టెండూల్కర్, చెన్నైయిన్ ఎఫ్సి సహ యజమాని మహేంద్రసింగ్ ధోనీ శనివారం చేరుకుంటారు. ఇక రియో ఒలింపిక్ స్టార్ పి వి సింధు ప్రారంభ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ కానున్నారు.
పుణె సిటీ హోం మ్యాచ్ల టిక్కెట్లు విక్రయానికి రెడీ!
పుణె: హృతిక్ రోషన్ సహ యజమానిగా గల రాజేశ్ వాధ్వాన్ గ్రూప్ యాజమాన్యంలోని ఐఎస్ఎల్ క్లబ్ 'ఎఫ్సి పుణె సిటీ' తమ జట్టు అభిమానులకు కనువిందుచేసేందుకు సిద్ధమైంది. అభిమానుల కోసం టిక్కెట్ల విక్రయాల్లో కొన్ని రాయితీలు కూడా కల్పించింది.
'ఎఫ్సి పుణె సిటీ' అధికారిక లోగో గల టిక్కెట్లు ప్రస్తుతం బుక్మై షో డాట్కాంలో అందుబాటులో ఉన్నాయి. ఇక పుణె సిటీలోని ఫెర్గూసన్ కాలేజీ, బాలేవాడి స్టేడియం వద్ద గల 'ఎఫ్సి పుణె సిటీ' అధికారిక మర్చండైల్ షాప్ వద్ద అభిమానులకు టిక్కెట్లు విక్రయించేందుకు శాశ్వతంగా బాక్స్ ఏర్పాటుచేయనున్నారు.
వీటితోపాటు ఫోనిక్స్ మార్కెట్ సిటీ, సినీ పోలిస్ మల్టీప్లెక్స్ తదితర 'క్లబ్' విలువైన భాగస్వామ్య షాప్ల వద్ద కూడా టిక్కెట్లు లభిస్తాయి. మ్యాచ్ టిక్కెట్ల ధర రూ.150 నుంచి రూ. 12 వేల వరకూ పలుకుతుంది. ఈ నెల 10వ తేదీలోపు మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సీజన్ పాస్ కోసం అభిమానులు ఐదు టిక్కెట్లు కొనుగోలుచేస్తే రెండు మ్యాచ్లకు టిక్కెట్లు ఉచితంగా పొందొచ్చు. విఐపి టిక్కెట్ కొనుగోలు దారులు.. ఎఫ్సి పుణె సిటీ ఫ్రాంచైసీ కొత్తగా రూపొందించిన 'జెర్సీ'ని 35 శాతం రాయితీపై కొనుగోలు చేయొచ్చ. సీజన్ పాస్లు సుమారు 150 / 200 మందికి ఇవ్వవచ్చు. కాగా పుణె సిటీ ఎఫ్సి ఈ నెల మూడో తేదీన పుణెలోని బలేవాడి స్టేడియంలో ముంబై సిటీ ఎఫ్సి జట్టుపై తల పడనున్నది.