కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ మూడో సీజన్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు అట్లెంటికో డీ కోల్కతా జట్టుకు ఊరట లభించింది. రాత్రివేళ్లలో రవీంద్ర సరోవర్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్లు ఆడేందుకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) నుంచి అనుమతి లభించింది. కోల్కతా పర్యావరణవేత్త సుభాష్ దత్తా దాఖలుచేసిన పిటిషన్ను విచారించిన ట్రిబ్యునల్.. ఎకె సన్యాల్ నేతృత్వంలో ఎన్జిటి నియమించిన ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులు చేసింది.
మ్యాచ్ల నిర్వహణకు వేసిన ఫ్లడ్ లైట్లపై బ్లాక్ క్తాథ్ చుట్టాలని, లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని, బాణాసంచా పేల్చరాదని ఆంక్షలు విధించింది. అలాగే కార్లను స్టేడియంకు 500 మీటర్ల దూరంలో పార్కింగ్ చేయాలని స్పష్టంచేసింది. ఈ ఆంక్షలను అమలుచేయకుంటే మ్యాచ్లు నిర్వహించవద్దని హెచ్చరించింది.
'ఫ్లడ్లైట్లు రాత్రి పది గంటల వరకు వేయొచ్చు. మ్యాచ్ పూర్తయిన వెంటనే లైట్లు ఆర్పివేయాలి. గ్రీన్ బెల్ట్ సృష్టించాలి. ఒకవేళ మ్యాచ్ల నిర్వాహకులు ఆంక్షలు అమలుచేయకుంటే హైకోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది' అని సుభాష్ దత్తా మీడియాకు చెప్పారు.
నాగోవా గ్రామంలో ఎఫ్సి గోవా ప్రాక్టీస్
పానాజీ: ఎఫ్సి గోవా జట్టు ఓ గ్రామ పంచాయతీ ఆవరణలోని మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించింది. రియో జనైరియోలో విజయవంతంగా ప్రాక్టీస్ పూర్తిచేసుకుని స్వదేశానికి చేరుకున్న గోవా జట్టుకు పానాజీలో ప్రాక్టీస్కు సరైన మైదానం అందుబాటులో లేకుండా పోయింది. దీంతో నాగోవా గ్రామ పంచాయతీలోని మైదానంలో జట్టు సభ్యులు ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
చీఫ్ కోచ్ జికో సారధ్యంలో పలువురు కోచ్ల పర్యవేక్షణ మధ్య ప్రాక్టీస్ సాగింది. పుణె కేంద్రంగా ఆడుతున్న డీఎస్కె శివాజీయన్స్తో ఈ నెల 29వ తేదీన ఎఫ్సి గోవా జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్, మరుసటి రోజు అండర్ - 19 ప్రపంచ వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత్ జట్టుతో మరో మ్యాచ్ ఆడనున్నది.
వచ్చేనెల నాలుగో తేదీన గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి జట్టుతో ఎఫ్సి గోవా జట్టు తలపడుతుంది. ఎనిమిదో తేదీన గోవాలోని ఫాటోర్డా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది.
యు - 17 వరల్డ్ కప్ ఎంబ్లమ్ ఆవిష్కరణ
వచ్చే ఏడాది భారత్ నిర్వహించే అండర్ - 17 ప్రపంచకప్ అధికారిక ఎంబ్లమ్ను స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ (ఎల్వోసీ) ఆవిష్కరించింది. ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటినో, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ సమక్షంలో ఎంబ్లమ్ ఆవిష్కరించారు.
ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో మాట్లాడుతూ ఫుట్బాల్ ఆట ప్రోత్సాహానికి శరవేగంగా భారత్ దూసుకెళుతున్న తీరును తెలుసుకునేందుకు రంగం సిద్ధమైందన్నారు. కానీ ఫుట్బాల్ ఆట పురోభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయన్నాడు. ఫిఫా యు - 17 వరల్డ్ కప్ అందుకు ఒక మార్గమన్నారు.
హిందూ మహాసముద్రం, మర్రిచెట్టు, స్టార్బస్ట్, కైట్లతోపాటు భారత జాతీయతకు గుర్తుగా అశోక చక్రను తలపించే విధంగా ఎంబ్లమ్ రూపొందించారు. భారత్లోని భిన్నత్వంలో వైవిధ్యాన్ని వెలుగెత్తి చాటేలా తయారైంది. ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ తొలి ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించడం భారత్కు, ఎఐఎఫ్ఎఫ్కు చరిత్రాత్మక సన్నివేశమన్నాడు. ఈ టోర్నీతో దేశంలో ఫుట్బాల్ ఆటతీరునే మార్చివేస్తుందన్నారు.
టోర్నమెంట్ డైరెక్టర్ జావియర్ చెప్పి మాట్లాడుతూ 'ఈ టోర్నమెంట్ ఒక మైలురాయి వంటిదని, ప్రస్తుతం భారత్ విలక్షణ ప్రతిష్ఠ కలిగి ఉన్నదని, ఫిఫా అండర్ - 17 టోర్నీ నిర్వహణతో దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఫుట్బాల్ పట్ల ఆసక్తి పెరుగుతుందని, ఇది అద్భుతమైన అవకాశం' అని అన్నాడు.