ముంబై: సుదీర్ఘ కాలంగా టీమిండియాకు దూరమైన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తాను తిరిగి జాతీయ జట్టుకు ఆడే అవకాశాలపై ఇంకా ఆశలు వదులుకోలేదు. మరో ప్రపంచ కప్ ఆడటం గౌరవమేనని యువరాజ్ తెలిపాడు.
'ప్రపంచ కప్ అంటే ప్రపంచ కప్పే. అది ట్వంటీ20నా, వన్డే ఫార్మాట్ అన్న దానితో సంబంధం లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనున్న తరుణంలో నా ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాను' అని యువీ పేర్కొన్నాడు.
రంజీ ట్రోఫీ గ్రూప్ లీగ్లో భాగంగా బుధవారం యువరాజ్ మీడియాతో మాట్లాడారు. 'ఆటను ఆస్వాదించినంత వరకు నేను క్రికెట్ ఆడతా' అని యువీ పేర్కొన్నాడు. భారత జట్టులో తిరిగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని తెలిపాడు.
2007లో జరిగిన ప్రపంచ కప్ ట్వంటీ20, 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ టోర్నీలను భారత్ గెలవడంలో యువీ పాత్ర మర్చిపోలేనిదని చెప్పుకోవచ్చు. కాగా, ఈ ఆల్ రౌండర్ వచ్చే ఏడాది జరిగే ట్వంటీ20 టోర్నీకి ఎంపికవుతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
'ఆట ఆడటం అనేది ఒక పాషన్. సచిన్ టెండూల్కర్తో నిరుడు మాట్లాడిన సమయంలో ఆయన కొన్ని మాటలు చెప్పారు. 'భారత్ తరపున ఆడటమనేది చాలా గొప్ప విషయం. అయితే ఆటను ఆస్వాదించడం మానుకోకూడదు. చిన్నతనంలో ఆటను ఆస్వాదించాం. అప్పుడు భారత్ తరపున ఆడతామని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు' అని యూవీ తెలిపారు.