ముంబై: బీసీసీఐ అధ్యక్ష పదవికి దాల్మియాకు లైన్క్లియరైంది. ఈ మేరకు ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవికి ఆదివారం నామినేషన్ను దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి దాల్మియా ఎన్నిక ఏకగ్రీవం కానున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ పదవికి అనురాగ్ ఠాకూర్, సంజయ్పటేల్ మధ్య పోటీ నెలకొంది.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, ఐపీఎల్ వివాదం నేపథ్యంలో అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పదవిని దక్కించుకునేందుకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ప్రధాని నరేంద్రమోడీనే కలిశారు. తనను ఏకగ్రీవంగా బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎంపికయ్యేలా చూడాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ విషయంపై మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీంతో గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన జగ్మోహన్ దాల్మియా రంగంలోకి దిగారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న దాల్మియా, బీసీసీఐ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు అందుబాటులోని అన్ని మార్గాలను పరిశీలించారు.
ప్రస్తుతం బీసీసీఐ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన అన్ని అసోసియేషన్ల మద్దతు శ్రీనివాసన్కు ఉన్న విషయం తెలిసిందే. దీంతో నేరుగా శ్రీనివాసన్ని ఆశ్రయించి, మంతనాలు జరిపారు. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం తనకు లేదని తేలిపోవడంతో తన శిబిరం నుంచి దాల్మియాను నిలబెట్టాలని శ్రీనివాసన్ నిర్ణయించుకున్నారు.
దాల్మియాను నిలబెట్టడంలో శ్రీనివాసన్ మద్దతుదారులు నుంచి ఏకాభిప్రాయం సాధించినట్లు తెలుస్తోంది. సోమవారం బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా బోర్డు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.