రియో డీ జెనిరో: మారథాన్ రన్నర్ ఓపీ జైషా, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) మధ్య వివాదం ముదురుతోంది. రియో ఒలింపిక్స్ మారథాన్ పరుగులో భారత అధికారులు తనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, తాను చనిపోయి ఉండేదాన్నని జైషా ఆరోపించిన విషయం తెలిసిందే.
రియో ఒలింపిక్స్లో చనిపోయి ఉండేదాన్ని: రన్నర్ ఓపీ జైషా
తాము ఎనర్జీ డ్రింక్స్ ఇస్తామంటే జైషానే వద్దని చెప్పిందని అధికారులు అంటున్నారు. దీనిపై జైషా కూడా ఘాటుగానే స్పందించారు. అక్కడ ప్రతిచోట కెమెరాలు ఉన్నాయని, అవే ఆధారాలని ఆమె చెప్పారు. దీనిపై విచారణ జరగాలన్నారు.
తాను అంత పెద్ద అబద్ధం ఎందుకు చెబుతానని, తన కెరీర్లో ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరి డ్రింక్స్ వారు తాగేందుకు ప్రతి టీమ్కు అనుమతి ఉందని, అయితే జైషా, రౌత్ మాత్రం వాటిని నిరాకరించారని అథ్లెటిక్ ఫెడరేషన్ అధికారులు వెల్లడించారు.
అయినా రేసు మధ్యలో వారు ఆ డ్రింక్స్ను కావాలనుకుంటే నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాటర్ బూతుల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
అయితే జైషా మాత్రం ఏఎఫ్ఐ వాదనను ఖండిస్తోంది. తాను ప్రభుత్వం, ఏఎఫ్ఐతో పోరాడి గెలవకపోవచ్చని, అయితే చివరి వరకు తన వాదన పైనే నిలబడతానన్నారు. భారత అధికారుల తీరుతో ఒలింపిక్స్ మారథాన్ రేసులో తాను చచ్చిపోయేదాన్నేమోనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.