హైదరాబాద్ : బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ గోపీచంద్పై భారత డబుల్స్ స్టార్ షట్లర్ జ్వాలా గుత్తా మరోసారి విరుచుకుపడ్డారు. ఆమెకు మరో క్రీడాకారిణి అశ్విని మద్దతు పలికింది. గోపీచంద్ మాత్రం ఆమె విమర్శలను తిప్పికొడుతున్నారు. జాతీయ కోచ్ గోపీచంద్ కొందరిపై వివక్ష చూపుతున్నారని జ్వాలా గుత్తా ఆరోపించింది. అందరినీ సమానంగా చూడాలని, లేదంటే గోపీ తన పదవి నుంచి తప్పుకోవాలని ఓ అంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమాండ్ చేసింది.
ప్రతీ విజయం తర్వాత తాను ఒకే మాట చెప్పాల్సి వస్తోందని, ఎందుకంటే తాము గెలిచినప్పుడు మాత్రమే ప్రజలు వింటున్నారని ఆమె అన్నారు. అశ్వినీ, తాను కెరీర్లో ఎంతో సాధించామని, కానీ తమకు సరైన గుర్తింపు రాలేదని, దానికి గోపీచందే కారణమని ఆమె అన్నారు.
తాము ఇప్పుడు ప్రపంచ 13వ ర్యాంక్లో ఉన్నామని, గోపీచంద్ తమకు సహ కరించాల్సింది పోయి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. కెనడా ఓపెన్లో తమ గెలుపుతో గోపీచంద్ తప్ప దేశం మొత్తం సంతోషపడుతున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, క్రీడల మంత్రి కార్యాలయాల నుంచి తమ ఇద్దర్నీ అభినందిస్తూ సందేశాలు వస్తున్నాయని, గోపీ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా రాలేదని ఆమె అన్నారు.
అశ్విని, తాను 2011 ప్రపంచ చాంపియన్షిప్స్లో కాంస్యం నెగ్గామని, 2010, 2014 కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి తొలిసారి స్వర్ణం, రజతం సాధించిపెట్టామని, అయినా మమ్మల్ని టాప్ పథకంలో చేర్చలేదని, తాము గోపీచంద్ అకాడమీకి చెందిన వారం కాదు కాబట్టే అలా చేర్చలేదని ఆమె అన్నారు.
43వ ర్యాంక్లో ఉన్న గురుసాయి 'టాప్'లో ఉండడం సబబేనా అని ఆమె అడిగారు. ఒకవేళ మహిళల డబుల్స్లో టాప్ ర్యాంక్లో ఉన్న వారు ఒలింపిక్స్లో రాణించేందుకు అర్హులు కారని ప్రభుత్వం, గోపీ అనుకుంటే మాత్రం ఏదో పెద్ద తప్పు జరిగినట్టేనని ఆమె అన్నారు. అందుకే గోపీ తన పదని నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ విజయానికి జాతీయ కోచ్ కచ్చితంగా గర్వపడాలని, అందరికంటే ముందు తమను అభినందించాలని, కానీ, జ్వాల, తన విషయంలో మాత్రమే ఇది జరగదని, దీన్ని బట్టి ఏదో తప్పు జరుగుతోందని తెలుస్తోందని అశ్విని అన్నారు. ఒకవేళ చీఫ్ కోచ్ ఆటగాళ్లందర్నీ సమానంగా చూస్తే మాత్రం కెనడా ఓపెన్లో తాము స్వర్ణం సాధించినందుకు గోపీచంద్ ఆనంద పడాలని, జ్వాల చెప్పిన ప్రతీ విషయానికీ తన పూర్తి మద్దతు ఉంటుందని, చీఫ్ కోచ్ పదవి నుంచి గోపీచంద్ తప్పుకోవాలని అన్నారు.
కెనడా ఓపెన్లో అద్భుత విజయం సాధించిన జ్వాలను అభినందించేందుకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని, జ్వాలకు విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి నేను అధ్యక్షుడిగా ఉన్న రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులను పంపించానని గోపీచంద్ చెప్పారు. అయితే తనకు స్వాగతం పలకలేదని, తన నుంచి అభినందన సందేశం రాలేదని జ్వాల చెప్పిందని అన్నారు.
తనను పదవి నుంచి తప్పుకోవాలనే నైతిక అర్హత జ్వాలకు లేదని, గడిచిన పదేళ్లలో ఆమె దాదాపు 200లకు పైగా టోర్నీల్లో పాల్గొని ఉంటుందని, తాను ఆమె పేరును ప్రతిపాదించకపోతే అన్ని టోర్నీల్లో ఎలా పాల్గొనేదని అన్నారు. తాను మద్దతు ఇవ్వలేదన్న దానిపై ఆమె స్పష్టత ఇవ్వాలని, అది ఒకవేళ స్పాన్సర్ల గురించి అయితే.. ఆటగాళ్లకు స్పాన్సర్లను వెతికి పెట్టడం తన బాధ్యత కాదని గోపీచంద్ అన్నారు.
ఒకవేళ తాను ఆ పని చేసినా కూడా తన గురించి తప్పుగా మాట్లాడే వారికి స్పాన్సర్ను తెచ్చిపెట్టలేనని, తానేమిటో తన చర్యలు, తన పనితీరే చెబుతాయని అన్నారు.