బెంగళూరు: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల.. కోచ్ గోపీచంద్తో పాటు క్రీడాశాఖ అధికారులపై ఇటీవల చేసిన విమర్శలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)కు ఆగ్రహం తెప్పించాయి. తాము అందరు అథ్లెట్లను సమానంగానే చూస్తామని, జ్వాల వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని 'సాయ్' డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు.
'అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను టోర్నీలకు పంపించడంలో గానీ శిక్షణ ఇవ్వడంలో గానీ మేం ఎలాంటి వివక్షా చూపించలేదు. అందరు అథ్లెట్లను ఒకేలా చూశాం' అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్పై జ్వాల చేస్తున్న విమర్శలను కూడా 'సాయ్' డెరైక్టర్ తిప్పికొట్టారు.
ఇది డబుల్స్ విభాగాన్ని ప్రోత్సహించడంలో గోపీచంద్ చేసిన కృషిని విస్మరించడమేనని ఆయన అన్నారు. 'గోపీకి అన్ని విధాలా మేం మద్దతు పలుకుతున్నాం. ఆటగాడిగా, కోచ్గా, అడ్మినిస్ట్రేటర్గా అతని సమర్థతను ఎవరూ ప్రశ్నించలేరు. ఒక ప్లేయర్ అర్థరహిత విమర్శల వల్ల అతను ఆటకు చేసిన సేవల విలువ తగ్గిపోదు. గోపీపై జ్వాల చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితం' అని శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు.
టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)లో జ్వాల, అశ్వినీలను చేర్చకపోవడానికి గోపీచందే కారణమని చేసిన విమర్శలను కూడా ఆయన తప్పు పట్టారు. 'ఇవన్నీ నిరాధార ఆరోపణలు. నిజానికి 'టాప్'లో డబుల్స్ ఆటగాళ్లను కూడా చేర్చాలంటూ ప్రత్యేకంగా వీరిద్దరి పేర్లను గోపీచంద్ స్వయంగా గత సమావేశంలో ప్రతిపాదించారు' అని చెప్పారు.
'డబుల్స్ కోసం విదేశీ కోచ్ను తీసుకు రావడంలో కూడా గోపీదే కీలక పాత్ర. గోపీలాంటి వ్యక్తిని ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శించడం తప్పు. ఈ విషయంలో ఆమె లక్ష్మణ రేఖ దాటకూడదు' అని శ్రీనివాస్ గట్టిగా హెచ్చరించారు.
'టాప్' కమిటీలో తనను చేర్చమని గానీ, తన అకాడమీని జాతీయ శిక్షణా కేంద్రంగా చేయమని గానీ, గోపీచంద్ ఎప్పుడూ సిఫారసు చేసుకోలేదని, అతనిపై నమ్మకంతోనే ఈ బాధ్యత ఇచ్చామని, దానిని ఆయన నిలబెట్టుకున్నారని 'సాయ్' డెరైక్టర్ శ్రీనివాస్ కోచ్ గోపీచందర్కు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ పూర్తి మద్దతుతోనే జ్వాల, అశ్వినీలు బ్యాడ్మింటన్ ఆడగలుగుతున్నారని చెప్పారు.