ముంబై: బీసీసీఐ సెక్రటరీగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్కి ఓ క్రికెట్ బుకీతో సంబంధాలున్నాయంటూ మీడియాలో వార్తా కథనాలు రావడంతో భారత క్రికెట్ వర్గాల్లో అలజడి ప్రారంభమైంది. అనురాగ్ ఠాకూర్పై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐకి లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే.
దీంతో అనురాగ్ ఠాకూర్, ఐసీసీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్ను ఉద్దేశించి లేఖ రాశారు. ఈ లేఖలో మీడియాలో వచ్చిన ఫోటోను శ్రీనివాసనే లీక్ చేశాడంటూ ఠాకూర్ ఆరోపణలు చేశాడు. అంతేకాదు, బోర్డు సభ్యులపైనా శ్రీనివాసన్ స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాడని తన లేఖలో మండిపడ్డాడు.
అసలు భారత్ క్రికెట్లో ఇంత చర్చ జరగడానికి కారణం ఏమిటంటే ఐసీసీ యాంటీ కరప్షన్ నిషేధిత జాబితాలో ఉన్న కరణ్ గిల్హోత్రాతో అనురాగ్ ఠాకూర్ కలిసి పార్టీ చేసుకోవడమే. అసలు ఇంతకీ ఎవరీ కరణ్ గిల్హోత్రా ఎవరనేది ప్రతి క్రికెట్ అభిమానిని మదిలో ఉన్న ప్రశ్న.
పంజాబ్లోని ఫజిల్కా ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం ఘనియాని గిల్హోత్రా స్వస్ధలం. అతి పిన్న వయసులో ఆ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యాడంటూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించాడు. పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి.
భారత్లో సల్మాన్ ఖాన్ 'బీయింగ్ హ్యూమన్' ఫౌండేషన్ ఫ్రాంచైజీ కూడా నిర్వహిస్తున్నాడు. తనను బుకీగా పేర్కొండూ మీడియాలో వచ్చిన వార్తలపై కరణ్ గిల్హోత్రా స్పందించాడు. బీసీసీఐ సెక్రటరీగా సేవలందిస్తోన్న అనురాగ్ ఠాకూర్ తనకు పదేళ్లుగా తెలుసని, తనకు మంచి స్నేహితుడని చెప్పాడు.
అటు క్రికెట్ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో తనకు ఎందరో మిత్రులున్నారని, వారితో సన్నిహితంగా మెలిగినంత మాత్రాన తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నాడు.