గౌహతి: ముచ్చటగా మూడో వసంతంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నమెంట్ మరో 24 గంటల్లో ప్రారంభం కానున్నది. రెండున్నర నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ టోర్నీలో గత రెండు ఎడిషన్లలో తల పడిన ఎనిమిది జట్లే తిరిగి తలపడుతుండటం గమనార్హం.
మరోవైపు దేశీయ ఫుట్ బాల్ ను ఇంతకుముందే ఉనికిలో ఉన్న 'ఐ - లీగ్'తో విలీనం చేసేందుకు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య, ఏషియాన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్ సి) కసరత్తుచేస్తున్నాయి.
వచ్చే ఏడాదికి విలీన ప్రక్రియ రూపుదిద్దుకోవచ్చునని భావిస్తున్నారు. అన్ని వర్గాల వారిని పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యమైన ఒప్పందంతో ఐ - లీగ్, ఐఎస్ఎల్ ల విలీనానికి ఏర్పాట్లుచేస్తున్నారు.
ఇక గత రెండు ఎడిషన్లలోనూ ఫుట్ బాల్ అభిమానులకు పంచిన ఆనందాన్నే మరోసారి ఐఎస్ఎల్ 3 సీజన్ అందించనున్నది. శనివారం అసోం రాజధాని గౌహతిలో జరిగే ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖుల పాల్గొననున్నారు.
ఇప్పటికే ఐఎస్ఎల్ 3 ప్రారంభోత్సవాన్ని 'ఈశాన్య భారత'చారిత్రక వారసత్వం, సంప్రదాయాలకు గుర్తింపు తేవాలన్నదే తమ సంకల్పమని నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి ఫ్రాంచైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
పూర్తిగా రిటైరైన పెద్ద పెద్ద ఆటగాళ్లు, సెమీ రిటైర్డ్ ఆటగాళ్ల మేలు కలయికతో జరుగుతున్న ఈ లీగ్ టోర్నీకి గ్లోబల్ బ్రాండ్ చేకూర్చాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
అట్లెంటికో మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్ మాజీ స్టార్ డియాగో ఫోర్లాన్, బ్రెజిలియన్ వరల్డ్ కప్ విజేత లుసియో, మాజీ చెల్సియా మిడ్ ఫీల్డర్ ఫ్లోరెంట్ మాలౌడా, మాజీ లివర్ పూల్, ఎఎస్ రోమా మ్యాన్ జాన్ అమె రైస్ తదితర పేరొందిన ఆటగాళ్ల ఆధ్వర్యంలో శనివారం నుంచి టోర్నమెంట్ సాగనున్నది.
తొలి మ్యాచ్ శనివారం గౌహతిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి, కేరళ బ్లాక్ బస్టర్స్ మధ్య జరుగనున్నది. ఈ రెండు ఫ్రాంచైసీల మధ్య టోర్నీ ప్రారంభం కావడం ఇది ముచ్చటగా మూడోసారి.
2014లో జరిగిన మ్యాచ్ లో నార్త్ ఈస్ట్ 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధిస్తే, 2015లో 1 - 3 తేడాతో కేరళ చేతిలో పరాజయం పాలైంది. తొలి ఏడాది రన్నరప్స్ గా నిలిచిన కేరళ బ్లాక్ బస్టర్స్ గత ఏడాది ఫ్రాంచైసీ యాజమాన్య మార్పులతో పలు సమస్యలను ఎదుర్కొన్నారు.
కొత్త సహ యజమానుల తాజా ఆకాంక్షలకు అనుగుణంగా నార్త్ ఐర్లాండ్ ఇంటర్నేషనల్ ఆరోన్ హుగెస్.. కేరళ బ్లాక్ బస్టర్స్ సారధిగా, కోచ్ స్టీవ్ కొప్పెల్, ఫార్వర్డ్ మిఖైల్ చోప్రా, డిఫెండర్ కెడ్రిక్ హెంగ్ బర్ట్ కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది.
నార్త్ఈస్ట్ కొత్త కోచ్ గా రంగంలోకి దిగిన నీలో వింగాడా ఎల్లవేళలా ప్రాంతీయ యువ క్రీడాకారులపైనే ప్రధానంగా కేంద్రీకరించాడు. అనుభవం కల క్రీడాకారుడిగా జొకొరా సారధ్యంలో జట్టు రంగంలోకి దిగింది.
ఎఫ్ సి గోవాకు కోచ్ గా బ్రెజిల్ లెజెండ్ జికో వరుసగా మూడో ఏట బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, డిఫెండింగ్ చాంపియన్ చైన్నై జట్టుకు మాట్టరాజీ కోచ్ గా ఉన్నారు.
ఎఫ్ సి గోవా సిటీ జట్టు స్పానిష్ కోచ్ జావియర్ హబాస్ తమ ఆధీనంలోకి క్రీడాకారులకు మెళకువలు నేర్పారు. ఇక భారతీయ క్రీడాకారుల ఆటతీరు మెరుగు పరిచేందుకు ప్రారంభమైన ఆకర్షణీయమైన ఈ టోర్నమెంట్ వల్ల జాతీయస్థాయి జట్టు ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువే.
కాకపోతే గత రెండు ఎడిషన్లలో సత్తా చాటిన జెజె లాపెకౌలా, మందార్ రావు దేశాయి, రోమియో ఫెర్నాండెస్, సందేశ్ ఝిగ్నాన్ వంటి స్థానిక క్రీడాకారులు కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు.
గత ఏడాది టోర్నీ పూర్తయిన తర్వాత ఫ్రాంచైసీలన్నీ తమ జట్లకు విదేశీ పిచ్ లపై శిక్షణనిచ్చాయి. ఆయా దేశాల్లోని ఫుట్ బాల్ క్లబ్ లతో ఫ్రెండ్లీ మ్యాచ్ లు ఆడి తమ ఆట తీరులో తప్పిదాలు, పొరపాట్లను సరిదిద్దుకున్నారు. మూడోసారి ఫ్రాంచైసీలన్నీ స్థానిక ప్రతిభావంతులకు పట్టం గట్టడానికి ప్రాధాన్యం ఇచ్చాయి.
ఆంటోనియో లోపేజ్ హబాస్ నుంచి కోల్ కతా కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన జోస్ ఫ్రాన్సిస్కో మోలినా తన శిష్యులను మరోమారు తన శిష్యులను చాంపియన్లుగా నిలిపేందుకు కసరత్తుచేస్తున్నారు.
కోల్ కతా ఫ్రాంచైసీ యజమాని, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ.. ఫుట్ బాల్ టీం తన గుండె చప్పుడని తేల్చేయడంతో అభిమానుల్లో ఆశలు పెరిగాయి. ఇక కెప్టెన్ పొస్టిగ ఇప్పటికీ ఫిట్ గానే ఉన్నారు.
డిఫెండింగ్ చాంపియన్లు చెన్నైయిన్ ఎఫ్ సి.. ఈ దఫా మార్క్యూ ఫ్లేయర్ అండ్ సారధి ఇలానో, ప్రభావ పూరితమైన ఆటగాడు జాన్ స్టీవెన్ మెండోజా లేకుండానే బరిలోకి దిగుతున్నది.
ముంబై సిటీ ఎఫ్ సి డియాగో ఫోర్లాన్ ను సారధిగా ఎంచుకుని ఒప్పందంపై సంతకాలు చేయడంతో పతాక శీర్షికలకెక్కింది. ఆయనతోపాటు సునీల్ ఛెత్రి కీలకం కానున్నారు. ఈ జట్టుకు మూడోసారి మూడో మేనేజర్ రంగంలోకి రావడం ఆసక్తికర పరిణామం.
మహారాష్ట్రకు చెందిన ఎఫ్ సి పుణె సిటీ కూడా ఫిన్లాండ్ మాజీ సారధి ఎయిడూర్ గుడ్జోహెన్సన్ ను చేర్చుకున్నా.. ఆయనతోపాటు మిడ్ ఫీల్డర్ ఆండ్రే బికే గాయాలతో టోర్నీ ప్రారంభానికి ముందే వైదొలగారు. వారిద్దరూ లేని లోటును మేనేజర్ ఆంటోనియో లోపేజ్ హబాస్ ఎలా తీరుస్తారో వేచి చూడాల్సిందే.
గోవా స్థానిక క్రీడాకారులను చేర్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది. ఇప్పటి వరకు టోర్నీలో గెలుపొందే అవకాశాలు లేకున్నా ఢిల్లీ డైనమోస్ మేనేజర్ జియాంలుకా జంబ్రోట్టా మాత్రం ఈ దఫా టైటిల్ తమదేనని ఘంటాపథంగా చెప్పడం ఆసక్తికర పరిణామం.