ముంబై: క్రికెటర్ అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను, తన కూతురుని చంపుతానని అతుల్ శర్మ బెదిరించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లైకి సంబంధాలున్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.
బాంద్రా కోర్టు కాంప్లెక్స్లో తనను, తన కూతురుని చంపుతానని అతుల్ శర్మ బెదిరించినట్లు ఆయన తెలిపారు. లియాండర్ పేస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 10వ తేదీన అతుల్ శర్మ తనను బెదిరించినట్లు ఆయన ఫిర్యాదులో చెప్పారు.
శర్మపై కేసు నమోదు చేశామని, అరెస్టు మాత్రం చేయలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఆఫీసర్ కెవి నిగాడే చెప్పారు. రియా పిళ్లై, లియాండర్ పేస్ తమ 8 ఏళ్ల కూతురు కస్టడీ కోసం కోర్టులో పోరాటం చేస్తున్నారు.
తన ప్రాణాలకూ తన కూతురు ప్రాణాలకు ముప్పు ఉందని లియాండర్ పేస్ ఫిర్యాదు చేశారు. రియా పిళ్లైకు, అతుల్ శర్మకు మధ్య సంబంధాలున్నాయని చెప్పడానికి తగిన పత్రాలను కూడా తాను పోలీసులకు సమర్పించినట్లు ఆయన చెప్పారు. పేస్ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రియా పిళ్లై కేసు పెట్టారు.