న్యూఢిల్లీ: క్రికెట్లో ఆటగాళ్లు తరచూ గాయాలు పాలవుతుడటం చాలా సార్లు చూశాం. ఐతే ఇటీవల కాలంలో క్రికెటర్లు గాయలతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దేశీయ క్రికెట్ టోర్నీలో వేసిన బౌన్సర్ తలకు బలంగా తాకడంతో ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు.
గతంలో కొంతమంది క్రికెటర్లు మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయాలుపాలై ఆట నుంచి వైదొలగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1959లో అబ్దుల్ అజీజ్... 19 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతుండగా, బంతి తన ఛాతికి బలంగా తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. చివరకు ఆసుపత్రిలో మరణించాడు.
1960లో వెస్టిండిస్ బౌలర్ చార్లీ గ్రిఫ్రిత్ వేసిన బౌన్సర్ భారత క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ తలకు బలంగా తగలడంతో ఆరు రోజులు కోమాలోకి వెళ్లాడు. ఆ తర్వాత నారీ కాంట్రాక్టర్ క్రికెట్ నుంచి వైదొలగాడు.
1975లో న్యూజిలాండ్ ఆటగాడు ఈవెన్ ఛాట్ ఫీల్డ్కు ఇంగ్లాండ్ పేసర్ పీటర్ లీవర్ వేసిన బంతి బలంగా తగలడంతో అతనికి నాలుకకు తీవ్రగాయమైంది. ఇక 1986లో వెస్టిండిస్ ఫేస్ బౌలర్ మైఖెల్ మార్షల్ వేసిన బంతి ఇంగ్లాండ్ ఆటగాడు మైక్ గాటింగ్ ముక్కుకు తగిలి అతనికి తీవ్ర రక్తస్రావం అయింది.
భారత్ క్రికెటర్ రమణ్ లాంబా షార్ట్ పైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తుండగా బంగ్లాదేస్ ఆటగాడు మోహ్రాబ్ హుస్సేన్ కొట్టిన షాట్కు అక్కడక్కిడే కిందకు పడిపోయాడు. వెంటనే ఆసుపత్రిలో చికిత్స చేర్పించి చికిత్స అందించినా.. మూడు రోజులు కోమాలో ఉన్న తర్వాత లాంబా మరణించాడు.
2013 డిసెంబరులో పాకిస్ధాన్ ఆటగాడు జుల్ఫికర్ భట్టీ(18) బౌన్సర్ ఛాతికి తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కాపాడలేక పోయారు. అదే ఏడాది అక్టోబరులో బౌన్సర్ బలంగా తలకు తాకడంతో దక్షిణాఫ్రికా ఆటగాడు డారెన్ రన్డెల్ తీవ్రంగా గాయపడి మరణించాడు.